logo

సీఎం జగన్‌ కంచుకోటలో ఎందుకీ కలవరం?

సీఎం జగన్‌కే కాదు.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి పులివెందుల కంచుకోట. ఓట్లు అడగకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు.

Updated : 07 May 2024 10:56 IST

ఇంటింటికీ జగన్‌ సతీమణి భారతి ప్రచారం
అడుగడుగునా ప్రజల నుంచి సమస్యలపై ఏకరవు
వైకాపా పాలనపై చాపకింద నీరులా అసంతృప్తి
పరిస్థితిపై స్థానిక నాయకుల మధ్య చర్చోపచర్చలు
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, చక్రాయపేట

పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం బాలతిమ్మయ్యగారిపల్లెలో వృద్ధురాలు లక్ష్మమ్మ చేతులు పట్టుకుని నచ్చచెబుతున్న సీఎం సతీమణి వైఎస్‌ భారతి

సీఎం జగన్‌కే కాదు.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి పులివెందుల కంచుకోట. ఓట్లు అడగకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సారి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా సీఎం జగన్‌ సతీమణి భారతి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళుతున్నారు. గతంలో కొన్ని ప్రాంతాలు, పల్లెలకు వెళ్లినా ఓ చోట నిల్చుని ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఆమె ఇంటింటికీ వెళ్లడంతో పాటు కుటుంబసభ్యులు, బంధువులను రంగంలోకి దింపి మరీ ప్రచారం చేస్తున్నారు. భారతి ప్రచారానికి ఎన్నడూ లేనంతగా ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

టీవల వేంపల్లెలో వైకాపా కీలక నేత భాస్కర్‌రెడ్డి పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో ముద్రణపై ప్రస్తావిస్తూ ఒకింత నిలదీసినట్లు వ్యవహరించారు. జగన్‌.. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటున్నారు.. నా రైతు కూడా అనాల్సిన పరిస్థితి ఉందంటూ.. అన్నదాతను విస్మరించారనే విధంగా ప్రస్తావించారు. పులివెందుల ప్రచారంలోనూ పలు చోట్ల ప్రజలు తమ సమస్యలను భారతి వద్ద ప్రస్తావించారు. వ్యక్తిగత సమస్యలను నివేదిస్తూ అధికారులు చేయడం లేదని వివరించారు. చక్రాయపేట మండలం బాలతిమ్మయ్యగారిపల్లెలో సోమవారం భారతి ఇంటింటి ప్రచారానికి వెళ్లగా, వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను పలువురు ప్రస్తావించారు. భారతి పర్యటనలో ఉన్న నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మరింతగా స్వరం పెంచి తమ కష్టాలు చెప్పుకొన్నారు. పక్కా ఇళ్లు మంజూరు కోసం తనతో పాటు తన కుమారుడు నాలుగైదు సార్లు దరఖాస్తు చేసుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదని భారతి ఎదుట కాలగిరి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సారికి ఓటేయి.. చేస్తామంటూ నేతలు సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా వారి వైపు తిరిగి మరింత తీవ్ర స్వరంతో మాట్లాడారు. తమ కుటుంబ కష్టాలు గురించి ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భారతి జోక్యం చేసుకుని పింఛను వస్తోందా? అవ్వా అంటూ ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేశారు. మావాళ్లు తప్పకుండా ఇళ్లు కట్టిస్తారంటూ హామీ ఇచ్చి వెనుదిరిగారు. కావలి సుభాషిణి అనే మహిళ.. భారతితో మాట్లాడుతూ ఇంటికోసం 12 సార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని, బోదకొట్టంలో జీవనం సాగిస్తున్నామంటూ దాన్ని చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నా ప్రభుత్వం నుంచి తమకు అమ్మఒడి పథకం వర్తించలేదని.. భర్త ఆటో నడుపుకొంటున్నప్పటికీ ఎలాంటి లబ్ధి చేకూరలేదని సుదర్శనమ్మ ప్రస్తావించారు. తన కుమారుడికి గుండెలో చిల్లు పడినప్పటికీ వైద్యం చేసుకునేందుకు మార్గం కనిపించలేదని విలపించారు. గోడకూలిన ప్రమాదంలో తన బిడ్డకు నడుము విరిగిపోయిందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం రాలేదంటూ ఓబులశెట్టి లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన సమయంలో ఇలాంటి నిలదీతలు, సమస్యలు ప్రస్తావనకు వచ్చిన దాఖలాల్లేవు. ఈ సారి మాత్రం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ధైర్యంగా తమ ఇబ్బందులను ప్రస్తావిస్తున్నారు.


వివేకా హత్యతో అప్రమత్తం

పులివెందుల నియోజకవర్గ ప్రజలు మాజీమంత్రి వివేకానందరెడ్డిని అమితంగా ప్రేమిస్తారు. ఏ చిన్న సమస్యనైనా చెప్పుకొంటే వెంటనే వారిని వాహనంలో అధికారి వద్దకు తీసుకెళ్లి పరిష్కరించే నైజం ఆయనది. దీంతో నియోజకవర్గంలో ఏ సమస్యనైనా పరిష్కరించడంతో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి ప్రస్తావనలు వచ్చేవి కావు. ఆయన మరణంతో ప్రజా సమస్యలు పట్టించుకునే వారే కరవయ్యారు. సీఎం జగన్‌ వచ్చినా సొంత నియోజకవర్గంలోనూ పరదాల చాటున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైనా ఆయనను కలవాలంటే ముందస్తుగా పాసులు తీసుకోవాల్సిన పరిస్థితి. పాసులు పొందడం అంత సులువు కాదు. వివేకా హత్య జిల్లాతో పాటు నియోజకవర్గంలో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సీబీఐ విచారణ, ఛార్జిషీట్‌ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావడంతో జనంలో పెద్ద చర్చ నీయాంశమైంది. జగన్‌ సోదరి షర్మిల సైతం వివేకా హత్య అజెండాపైనే కాంగ్రెస్‌ పార్టీ తరఫున రంగంలోకి దిగారు. వివేకా కుమార్తె సునీత గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజాకోర్టులో న్యాయం కావాలని వేడుకుంటున్నారు. షర్మిల, సునీత కొంగు చాచి ధర్మం, న్యాయం కావాలంటూ.. దీనికి ప్రజల మద్దతు కావాలని వేడుకుంటున్నారు. అటు రాజన్న బిడ్డ షర్మిల, ఇటు వివేకా తనయ సునీత కొంగు చాచి అనేంత పదాలు వాడడం ప్రజల మనసులను కదిలించాయి. ఈ పరిణామాల క్రమంలో జగన్‌ కుటుంబం ఎన్నికలపై మరింత జాగ్రత్త పడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలకు పార్టీ తరఫున రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆర్థికసాయం ఆశించేందుకు ఓ దరఖాస్తు సైతం రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. భారతి పర్యటనలో పోలీసులు, అనుచరులు నిలదీతలు తగ్గించడానికి ఓ వైపు కృషి చేస్తుంటే... నియోజకవర్గంలో పరిణామాలను పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టి... అవసరమైన చోట్ల డబ్బుల పంపిణీకి సిద్ధమయ్యారు. ఉద్యోగులు చాలా మంది తాయిలాలను తిరస్కరించడం వైకాపా వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని