icon icon icon
icon icon icon

Lok Sabha Elections: సార్వత్రిక సమరం.. ప్రారంభమైన మూడో విడత పోలింగ్‌

Lok Sabha Elections: మూడో విడతలో 17.24 కోట్ల మంది ఓటు వేయనున్నారు. 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరుగుతోంది

Published : 07 May 2024 07:31 IST

దిల్లీ: సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) మూడో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ విడతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. 1,300 మందికిపైగా అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు.

ఈ రాష్ట్రాల్లో..

మూడో విడతలో 17.24 కోట్ల మంది ఓటు వేయనున్నారు. వీరిలో 8.39 కోట్ల మంది మహిళలు. మొత్తం 1.85 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుజరాత్‌ 25, కర్ణాటక 14, మహారాష్ట్ర 11, ఉత్తర్‌ప్రదేశ్‌  10, మధ్యప్రదేశ్‌ 9, ఛత్తీస్‌గఢ్‌ 7, బిహార్‌ 5, పశ్చిమ బెంగాల్‌ 4, అస్సాం 4, గోవా 2, దాద్రానగర్ హవేలీ, దమణ్‌ దీవ్‌ 2 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. గుజరాత్‌, కర్ణాటక, బిహార్‌, మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ జరుగుతున్న అన్ని స్థానాలను 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాయే దక్కించుకోవడం గమనార్హం. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. గత నెల 26న 14 చోట్ల పోలింగ్‌ ముగిసింది. మిగిలిన 14 సీట్లలో ఈరోజు ఓటింగ్‌ జరుగుతోంది.

బరిలో ఉన్న ప్రముఖులు వీరే..

కేంద్రమంత్రులు అమిత్‌ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్‌ మాండవీయ, పరుషోత్తమ్‌ రూపాలా, ప్రహ్లాద్‌ జోషి, ఎస్‌.పి.సింగ్‌ బఘెల్‌ తృతీయ విడత బరిలో నిలిచిన ప్రముఖుల జాబితాలో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబానికి ఈ దశ చాలా కీలకం. ఆ కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. మైన్‌పురీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో బారామతి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, సిటింగ్‌ ఎంపీ సుప్రియా సూలే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

ఓటేయనున్న మోదీ, షా..

ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని సూరత్‌ నియోజకవర్గంలో ఇప్పటికే భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో, మిగిలిన పాతిక సీట్లకు మూడో దశలో పోలింగ్‌ జరగనుంది. గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని అహ్మదాబాద్‌ నగరంలో మోదీ, అమిత్‌ షా మంగళవారం ఓటు వేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img