బెయిలొచ్చినా 8 నెలలుగా జైల్లో..

రిమాండ్‌లో ఉన్న ఓ వ్యక్తి పేరులో ఉన్న తప్పు వల్ల బెయిల్‌ వచ్చి ఎనిమిది నెలలైనా జైల్లోనే ఉన్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Published : 21 Dec 2020 22:51 IST

పేరులో తప్పు కారణంగా వ్యక్తికి తిప్పలు


ప్రయాగ్‌రాజ్‌: రిమాండ్‌లో ఉన్న ఓ వ్యక్తి పేరులో ఉన్న తప్పు వల్ల బెయిల్‌ వచ్చి ఎనిమిది నెలలైనా జైల్లోనే ఉన్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. సిద్దార్థ్‌ నగర్‌కు చెందిన వినోద్‌ బారువార్‌ అనే వ్యక్తిని 2019లో మాదకద్రవ్యాల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్‌ కోసం ప్రయత్నించాడు. 2019 సెప్టెంబరు 4న అడినషల్‌ సెషన్స్‌ జడ్జి అతడి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేశారు. ఆ తర్వాత అతడు ఉత్తరప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించగా 2020, ఏప్రిల్‌ 9న అతడికి బెయిల్‌ మంజూరు చేశారు. కానీ అప్పటి నుంచి అతడు బయటకు రాలేదు. కారణం ఏంటంటే రిమాండ్‌లో ఉన్న సమయంలో పోలీసులు అతడి పేరును ‘వినోద్‌ కుమార్‌ బారువార్‌’ అని నమోదు చేసుకున్నారు. కానీ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఆర్డర్‌లో అతడి పేరు ‘వినోద్‌కుమార్‌’ అని మాత్రమే ఉంది. దీంతో సంబంధిత జైలు అధికారులు అతడిని విడుదల చేసేందుకు నిరాకరించారు. దీంతో సంబంధిత నిందితుడు తన పేరులో మార్పును కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో విషయం తెలుసుకున్న కోర్టు సిద్ధార్థ్‌ నగర్‌ జైలు సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆయనకు సమన్లు జారీ చేసింది. ‘‘పేరులో ఉన్న చిన్న సాంకేతిక తప్పిదం కారణంగా హైకోర్టు ఆర్డరును విస్మరించి, నిందితుణ్ని విడుదల చేయకపోవడం చిన్న విషయం కాదు.’’ అని కోర్టు ఘాటుగా స్పందించింది. అనంతరం సంబంధిత జైలర్‌ను కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

ఇవీ చదవండి..

మైనర్‌ చెల్లికి డ్రగ్స్‌ ఇచ్చి వ్యభిచారం

అమెరికాలో మరో హైదరాబాదీపై కాల్పులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని