కొవిడ్‌-19 రోబో రూపొందించిన యువకుడు

కరోనా.. ప్రస్తుతం ఈ పేరు వింటేనే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతోంది. అలాంటి వైరస్‌ బారిన పడిన వారికి సేవ చేయడమంటే మాటలా..?. అయినప్పటికీ ఎందరో వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్యంగా చికిత్స అందిస్తున్నారు.

Updated : 30 Sep 2022 17:06 IST

చిత్తూరు: కరోనా.. ప్రస్తుతం ఈ పేరు వింటేనే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతోంది. అలాంటి వైరస్‌ బారిన పడిన వారికి సేవ చేయడమంటే మాటలా..?. అయినప్పటికీ ఎందరో వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్యంగా చికిత్స అందిస్తున్నారు. అలాంటి వైద్యులు కొవిడ్‌ మహమ్మారి బారిన పడకుండా ఆధునిక సాంకేతికత సాయం చేస్తుందంటున్నాడు చిత్తూరు జిల్లా యువకుడు. వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా పలుమనేరు సమీపంలోని మొరం గ్రామానికి చెందిన పవన్‌ పద్మనాభన్‌ పాఠశాల స్థాయిలోనే చదువు ఆపేశాడు. కానీ.. మేధోసంపత్తుతో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు.  కొవిడ్‌ రోగికి వైద్యం అందించే డాక్టర్లు, ఇతర సిబ్బందికి వ్యాధి సోకే అవకాశాలపై అధ్యయనం చేసిన పవన్‌ పరిష్కార మార్గాలు కనుగొన్నాడు. విస్తృత పరిశోధనలతో రోగికి సేవలందించే రోబోను రూపొందించాడు. రూ.22వేలతో తయారుచేసిన మర మనిషికి కొవిడ్‌-19 రోబోగా నామకరణం చేశాడు. వైరస్‌ బారిన పడిన వారికి సేవ చేసేటప్పుడు వారి దగ్గరకు వెళ్లకుండానే మందులు, ఆహారం అందించేలా రోబోను తీర్చిదిద్దాడు. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, 360 డిగ్రీల కోణంలో తిరిగే ఫీచర్లను పొందుపరిచాడు. వీడియో రికార్డింగ్‌ ద్వారా రోగి పరిస్థితిని వైద్యులు సమీక్షించే ఏర్పాట్లు కూడా చేశాడు.  ట్యాబ్‌, ఫోన్‌కు అనుసంధానించి చెప్పినట్లు నడుచుకునేలా తయారు చేశాడు. రోగికి 100 మీటర్ల దూరంలో ఉంటూనే పనులు చక్కబెట్టే ఈ మర మనిషితో పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తి చేశాడు. స్వగ్రామం మొరంలో ఏర్పాటు చేసిన పవన్‌ ఎంపవర్‌ సొల్యూషన్స్‌ ద్వారా 30కిపైగా ఆవిష్కరణలు చేశాడు పవన్‌. ఇప్పుడు సరికొత్తగా తీసుకువచ్చిన కొవిడ్‌ రోబో అందరి ప్రశంసలు అందుకుంటోంది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని