ఫలితం వచ్చే లోపే ఆగిన గుండె

వచ్చింది కరోనానేమో అనే భయం... పాజిటివ్‌ అని నిర్ధారణ అయితే... చికిత్స కోసం ఖర్చు పెట్టలేక

Updated : 26 Apr 2021 19:35 IST

వచ్చింది కరోనానేమో అనే భయం... పాజిటివ్‌ అని నిర్ధారణ అయితే... చికిత్స కోసం ఖర్చు పెట్టలేక కుటుంబం  చితికిపోతుందేమోనన్న ఆందోళన... పరీక్ష ఫలితం రాకముందే ఓ నిండు ప్రాణం పోయింది. తర్వాత తెలిసింది.. అతనికి నెగెటివ్‌ అని... బిడ్డను ఒడిసిపట్టుకుని ఏడుస్తున్న ఆ తల్లిని ఎలా ఓదార్చేది? నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన.

రెంజల్‌ మండలం బోర్గాం గ్రామానికి చెందిన అశోక్‌(30) కొన్ని రోజులుగా తీవ్రజ్వరంతో బాధ పడుతున్నారు. కరోనాపై అనుమానంతో తల్లి గంగామణి, సోదరుడు ఆదివారం రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. ర్యాపిడ్‌ ఫలితంలో నెగెటివ్‌గా వచ్చింది. తీవ్రజ్వరంతో బాధపడుతుండటంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని కుటుంబసభ్యులు సిబ్బందిని కోరారు. రెండో సారి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితం రావడానికి సమయం పడుతుందనడంతో అశోక్‌ చెట్టు కింద కూర్చున్నారు. కొంతసేపటికి అక్కడే ప్రాణాలు వదిలారు. అశోక్‌ కదలకపోవడంతో తల్లి.. దగ్గరికి వెళ్లి తట్టిచూసింది. అప్పటికే చనిపోయాడని గ్రహించి బోరుమంది. కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని తల్లి రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. కొద్దిసేపటికే రెండో సారి నిర్వహించిన ఫలితం రాగా.. అందులోనూ నెగెటివ్‌గా తేలింది. తీవ్రజ్వరంతో బాధపడుతున్న అశోక్‌ గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని ఆరోగ్య సిబ్బంది తెలిపారు. మృతదేహాన్ని కుటుంబీకులు ట్రాక్టర్‌లో గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఆరేళ్ల కొడుకు ఉన్నారు. తల్లి గంగామణి పారిశుద్ధ్య కార్మికురాలు.

- న్యూస్‌టుడే, రెంజల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని