Exams: లక్ష ఉద్యోగాలకు పరీక్షలెప్పుడు..?

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ రోజువారీ కార్యకలాపాలకు అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో నిలిచిపోయిన రైల్వే ఉద్యోగ నియామక పరీక్షలను వెంటనే  నిర్వహించాలని...

Updated : 24 Nov 2022 16:04 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ రోజువారీ కార్యకలాపాలకు అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో నిలిచిపోయిన రైల్వే ఉద్యోగ నియామక పరీక్షలను వెంటనే  నిర్వహించాలని ట్విటర్‌ వేదికగా డిమాండ్లు పెరుగుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డులు చొరవ తీసుకొని పరీక్ష తేదీలను ఖరారు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో Conduct Railway Exam హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. రకరకాల మీమ్స్‌ పోస్టు చేస్తూ అభ్యర్థులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా రైల్వేలోని నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ (ఎన్‌టీపీసీ) విభాగంలో 35,208 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ జారీ అయ్యింది.  దీనికి 1.26 కోట్ల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇప్పటి వరకు 6 విడతల్లో  దాదాపు 95 లక్షల మందికి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహించారు. కానీ, కరోనా రెండో దశ ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మే 31న రైల్వే బోర్డు ప్రకటించింది. కానీ, ప్రస్తుతం కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో మిగిలిన అభ్యర్థులకు కూడా వీలైనంత త్వరగా పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు దేశంలోని వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న 1,03,769 గ్రూప్‌-డి పోస్టుల భర్తీకి 2019లో రైల్వే రిక్రూట్‌మెట్‌ సెల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 1,15,76,248 మంది ఉద్యోగార్ధులు అప్లై చేశారు. ఎన్‌టీపీసీ పరీక్షలు పూర్తయిన తర్వాత గ్రూప్‌-డి పరీక్షలు నిర్వహించాలనుకున్నారు. అయితే, ఎన్‌టీపీసీ పరీక్షలు  వాయిదా పడటంతో దాని ప్రభావం గ్రూప్‌-డి  పరీక్షలపైనా పడింది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రెండు పరీక్షలనూ వీలైనంత త్వరగా నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని