Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 17 Nov 2021 17:00 IST

1.7 నెలల్లో తెదేపాకు 13 శాతం ఓటింగ్‌ పెరిగింది: అచ్చెన్నాయుడు 

డబ్బు, అధికారం, పోలీసు బలగాలను ఉపయోగించి మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా గెలిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై   ఆయన స్పందించారు.

2.అధికారంలో ఉన్నా.. లేకపోయినా మేం ప్రజల పక్షమే: హరీశ్‌

రైతుల కోసమే తెరాస మహా ధర్నా తలపెట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా తలపెట్టినట్టు చెప్పారు. ఇందిరాపార్కు వద్ద గురువారం తెరాస ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నా ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.

3.సీబీఐ అదుపులో శివశంకర్‌రెడ్డి 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సలో ఉండగా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. శివశంకర్‌రెడ్డి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముఖ్య అనుచరుడు.

4.జెన్‌కో రుణాల వడ్డీ బకాయిలు చెల్లించకుంటే తీవ్ర చర్యలు: ఆర్‌ఈసీ

ఏపీ విద్యుత్‌ ఉన్నతాధికారులతో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్(పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిసిటీ కమిషన్‌(ఆర్‌ఈసీ) ప్రతినిధులు భేటీ అయ్యారు. విజయవాడలోని విద్యుత్‌ సౌధలో సమావేశం కొనసాగుతోంది. జెన్‌కో రుణాల వడ్డీ బకాయిలపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. నవంబర్‌ 5నాటి లేఖను ఈ సందర్భంగా ఆర్‌ఈసీ ప్రతినిధులు ప్రస్తావించారు.

5.‘టీవీ చర్చలే మరింత కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి’
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో బుధవారం మరోసారి విచారణ జరిగింది. పంట వ్యర్థాలు దహనం చేయడంపై తాము రైతులకు శిక్షలు విధించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. వాటిని దహనం చేయకుండా రైతులను ఒప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించామని వెల్లడించింది. అలాగే ఈ విషయంపై టీవీల్లో జరుగుతోన్న చర్చలపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

6.కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.. అదే దేశపు మంత్రం కావాలి: మోదీ

‘మరో 25 ఏళ్లు గడిస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది. ఈ పాతికేళ్లు ఎవరికి వారు.. తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. అదే దేశపు మంత్రం కావాలి. ఈ విషయాన్ని పార్లమెంట్‌, శాసనసభల ద్వారా దేశానికి వినిపించాలి’’అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 82వ ఆల్‌ ఇండియా ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ప్రారంభించారు.

7.చైనాలో మరో 18 ప్రమాదకర వైరస్​లు

కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో మరోసారి వైరస్‌ల కలకలం మొదలైంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 71 రకాల వైరస్​లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ వైరస్‌ జంతువుల నుంచే మనుషులకు సోకిందని పలు పరిశోధనలు వెల్లడించాయి.

8.ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన టీమ్ ఇండియా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే పదవీ కాలం ముగియనుండటంతో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  2012 నుంచి కుంబ్లే క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవిలో కొనసాగుతున్నాడు.

9.కంగనా వ్యాఖ్యలపై ‘నేతాజీ’ కుమార్తె ఏమన్నారంటే..!

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ (Subhash ChandraBose), భగత్‌ సింగ్‌లకు అప్పట్లో మహాత్మా గాంధీ నుంచి మద్దతు లభించలేదని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నేతాజీ కుమార్తె అనితా బోస్‌ (Anita Bose Pfaff) స్పందించారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌తో మాట్లాడిన ఆమె.. నేతాజీని నియంత్రించలేనని మహాత్మాగాంధీ భావించేవారని.. అందుకే వారిమధ్య కాస్త ఇబ్బందికరమైన వాతావరణమే ఉండేదని పేర్కొన్నారు.

10.రాహుల్‌ ద్రవిడ్‌ని అందుకే నమ్ముతున్నా: సునీల్ గావాస్కర్‌

భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. జైపూర్ వేదికగా నేడే తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌‌గా, రెగ్యులర్‌ టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించబోతున్నారు. వీరిద్దరూ కలిసి జట్టుని ఏ విధంగా ముందుకు తీసుకెళతారనేదిపై భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని