అమెరికాలో టీకా పంపిణీ మొదలు.. కానీ

అమెరికాలో కోట్లాది కరోనా వైరస్‌  డోసుల పంపిణీ  ప్రారంభం కానుందనే వార్తలు వెలువడుతున్నాయి.

Published : 13 Dec 2020 14:20 IST

రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొవిడ్‌ కేసులు..

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలో కరోనా వైరస్‌ కేసులు మరోసారి రికార్డ్‌ స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం మధ్యాహ్నానికి మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 16 మిలియన్లకుపైగా చేరుకుంది. ఇక ఇక్కడ కొవిడ్‌ మరణాలు మూడు లక్షల మార్కును దాటేశాయి. ఇదిలా ఉండగా ఆదివారం నుంచి ఆ దేశవ్యాప్తంగా కోట్లాది కరోనా వైరస్‌  డోసుల పంపిణీ  ప్రారంభం కానుందనే వార్తలు వెలువడుతున్నాయి. అమెరికాలో తొలిసారిగా ఫైజర్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర వినియోగానికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ను వాడేందుకు ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చినట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. అంతేకాకుండా 24 గంటల్లోగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో కరోనా అంతానికి, కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఈ చర్య కీలకం కానుందని నిపుణులు అంటున్నారు.

పంపిణీ ఇలా..

వ్యాక్సిన్‌ తొలి విడత పంపిణీలో భాగంగా దేశంలోని 145 ప్రాంతాలకు ఆదివారం చేరవేస్తామని.. ఇక టీకా వేసే ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతుందని అమెరికా ఆర్మీ జనరల్‌ గుస్తావే పెర్నా ప్రకటించారు. అనంతరం వివిధ రాష్ట్రాల్లోని మరో 636 ప్రాంతాల్లో టీకా పంపిణీ మంగళ, బుధవారాల్లో జరుగుతుందని ఆయన వివరించారు. తొలివిడత వ్యాక్సిన్లు వైద్యారోగ్య సిబ్బందికి అందజేస్తారని తెలుస్తోంది.  పంపిణీ సక్రమంగా, నిరంతరాయంగా సాగేందుకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ డోసులను ప్రతి వారం భారీ సంఖ్యలో సిద్ధం చేస్తామని ఆర్మీ జనరల్‌ వెల్లడించారు.

కరోనా ప్రభావంతో ప్రజారోగ్యం  తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. గత కొన్ని రోజులుగా సగటున రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా బాధితుల సంఖ్య నమోదవుతోంది. కేసుల సంఖ్య మళ్లీ పుంజుకోవటంతో ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక ఈ వారం సరాసరి మరణాల సంఖ్య అత్యధికంగా రోజుకు 2411 కావటం అక్కడి ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో.. అగ్రరాజ్యంలో ఫైజర్‌ టీకాకు అనుమతి లభించటం కీలక మలుపు అని పలువురు భావిస్తున్నారు.

ఇవీ చదవండి..

భారత్‌లో జనవరిలో వ్యాక్సినేషన్‌

కరోనా టీకా తీసుకున్నాక ఎలా ఉంటుందంటే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని