దీపం కిందే ఉంటారా.. ఎల్‌ఈడీలోకి వస్తారా!

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీపై భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు విమర్శలు చేశారు. బిహార్‌ అభివృద్ధికి భాజపా ఎంతో కృషి చేసిందని సోన్‌పూర్‌లో శనివారం నిర్వహించిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

Published : 01 Nov 2020 01:29 IST

పట్నా: బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీపై భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు విమర్శలు చేశారు. బిహార్‌ అభివృద్ధికి భాజపా ఎంతో కృషి చేసిందని సోన్‌పూర్‌లో శనివారం నిర్వహించిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీలు పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పాయి. కానీ మేము బిహార్‌లో 19లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నాం. ఆత్మనిర్భర్‌ బిహార్‌ పథకం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు ఉద్యోగాలు చేయడం కాదు.. ఇతరులకే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వస్తారు. అలాంటి అభివృద్ధిని మేం తీసుకురాబోతున్నాం. ఉద్యోగాలు ఎలా సృష్టించాలో మాకు తెలుసు. అంతేకానీ ప్రతిపక్షాల మాదిరి అధికారంలోకి రావడానికే ఉద్యోగాల హామీలను ఇచ్చినట్లు కాదు’అని ఆయన విమర్శించారు. 

అదేవిధంగా నడ్డా ఎన్నికల్లో ఆర్జేడీ దీపం గుర్తును ఉద్దేశిస్తూ.. ‘ప్రజలారా మీరు ఏం కోరుకుంటున్నారు? దీపమా లేదా ఎల్‌ఈడీ బల్బులా’అని ప్రశ్నించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ హయాంలో నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు బిహార్‌కు 11 వైద్య కళాశాలలు మంజూరు చేశాం. అదేవిధంగా రహదారులు, రైల్వే ట్రాక్‌లను విద్యుత్‌తో అనుసంధానం చేయడం వంటి అభివృద్ధి పనులు చేశాం. బిహార్‌లో రైతుల సంక్షేమం కోసం భాజపా ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చుచేసింది. విద్య కోసం రూ.వెయ్యి కోట్లు, ఆరోగ్యం కోసం రూ.600కోట్లు ఖర్చు చేసింది. జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.54వేల కోట్లు, సాధారణ రహదారులకు రూ.13వేల కోట్లు, రూ.2వేల కోట్లు విమానాశ్రయాల కోసం భాజపా వెచ్చించింది’అని నడ్డా వెల్లడించారు. 

బిహార్‌ శాసనసభకు మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు అక్టోబర్‌ 28న ఎన్నికలు పూర్తైన విషయం తెలిసిందే. మిగతా 172 స్థానాలకు నవంబర్‌ 3న రెండో దశ, నవంబర్‌ 7న మూడోదశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని