Cheetah: చీతాల మృతి.. దక్షిణాఫ్రికా స్పందన ఇదే!

కునో నేషనల్‌ పార్కు (Kuno National Park)లో చీతాలు మృతి చెందడంపై దక్షిణాఫ్రికా (South Africa) స్పందించింది. ఈ పరిస్థతి వస్తుందని ముందుగానే ఊహించామని తెలిపింది. చీతాలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది.

Published : 28 Apr 2023 19:03 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కు (Kuno national Park)లో దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతా (Cheetah) మృతి  చెందడంపై ఆ దేశ అటవీ, మత్య్స, పర్యావరణశాఖ (DFFE) స్పందించింది. ఈ తరహా పరిణామాలు ఉంటాయని ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఊహించామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ పెద్ద పెద్ద మాంసాహార జంతువులను ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించడం, వాటిని అక్కడ పెంచడం చాలా సంక్షిష్టమైన పని. అంతేకాకుండా కొన్ని జంతువులు కొత్త వాతావరణానికి అలవాటు పడలేవు. పరిసరాలు కూడా వాటిపై ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాణాలు కోల్పోతాయి’’ అని ప్రకటనలో పేర్కొంది.

భారత్‌లో చీతాలు మృతి చెందడానికి గల కారణాల కోసం వేచి చూస్తున్నట్లు దక్షిణాఫ్రికా వెల్లడించింది. తాజాగా మృతి చెందిన చీతా శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పింది. అయితే, చీతాల మృతికి అంటువ్యాధులు కారణమై ఉండొచ్చన్నదానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎఫ్‌ఎఫ్‌ఈ పేర్కొంది. ఫ్రీ ఎన్‌క్లోజర్లలోకి విడిచిపెట్టిన తర్వాత చితాలు కునో నేషనల్‌ పార్కు సరిహద్దులను దాటి వెళ్లిపోతున్నాయని, తిరిగి ఎలా లోపలికి రావాలో తెలియక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని, ఇది కూడా వాటి మృతికి కారణమై ఉండొచ్చని దక్షిణాఫ్రికా అభిప్రాయపడింది. చీతాలు క్రమంగా ఆ ప్రాంతానికి అలవాటుపడి, ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మరో 11 చీతాలను వచ్చే 2 నెలల్లో ఫ్రీ ఎన్‌క్లోజర్లలోకి పంపాలని కునో నేషనల్‌ పార్కు అధికారులు భావిస్తున్నారు.

భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా (Project Cheetah)లో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొదటి విడతలో గతేడాది సెప్టెంబరు 17న నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తీసుకురాగా, వాటిలో సాశా అనే ఆడ చీతా అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 27న మృతి చెందింది. రెండో విడతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు. తాజాగా వాటిలో ఉదయ్‌ అనే మగ చీతా మృత్యువాత పడింది. అయితే, తొలివిడతలో నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒక చీతా మార్చి 29న నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఇటీవలే ఈ చీతాలకు ప్రధాని మోదీ అభ్యర్థన మేరకు  వాటికి ప్రజలు సూచించిన దేశీయ పేర్లను పెట్టారు. వీటిలో కవల చీతాలైన ఎల్టన్‌, ప్రెడ్డీలకు గౌరవ్‌, శౌర్య అని పేర్లు మార్చగా, నాలుగు కూనలకు జన్మనిచ్చిన సియాయా చీతాకు జ్వాలా అని పేరు మార్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని