మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడినవారికి టీకా 

రోనా మహమ్మారి నివారణకు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ మరో.....

Updated : 24 Feb 2021 17:21 IST

దిల్లీ: కరోనా మహమ్మారి నివారణకు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి 45 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్‌ అందించనున్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. దేశంలో మొత్తం 10వేల ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేపడతామని వెల్లడించారు. మరో 20వేల ప్రైవేటు కేంద్రాల ద్వారా కూడా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. ప్రైవేటు కేంద్రాల్లో పంపిణీ చేసే వ్యాక్సిన్ల ధరలను కొద్ది రోజుల్లో నిర్ణయించనున్నట్టు తెలిపారు. రెండో దశ వ్యాక్సినేషన్‌లో 27 కోట్ల మంది ప్రజలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. 

మరోవైపు, దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా పంపిణీ భారీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 8 గంటల వరకు 1,21,65,598 మందికి వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 1,07,67,198 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మొదటి డోసు, 13,98,400 మందికి రెండో డోసు అందించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకొని 28 రోజులు పూర్తి చేసుకున్న వారికి ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు అందిస్తున్న విషయం తెలిసిందే. 39వ రోజు వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2,79,823 మందికి మొదటి డోసు, 1,40,223 మందికి రెండో డోసును అందించినట్టు అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని