లాక్‌డౌన్‌: మెరుగైన ‘గంగమ్మ’ ఆరోగ్యం

దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో గంగా నది స్వచ్ఛత మరింత పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం నిత్యావసరాలు తప్ప ఇతర పరిశ్రమలు నడవకపోవడంతో నదీలోకి వ్యర్థాలు చేరడం బాగా తగ్గిందని నిపుణులు, పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారితో మార్చి 24 వరకు...

Published : 03 Apr 2020 00:52 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో గంగా నది స్వచ్ఛత మరింత పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం నిత్యావసరాలు తప్ప ఇతర పరిశ్రమలు నడవకపోవడంతో నదీలోకి వ్యర్థాలు చేరడం బాగా తగ్గిందని నిపుణులు, పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారితో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) సమాచారం ప్రకారం చాలా పర్యవేక్షణ ప్రదేశాల్లో స్నానం చేసేందుకు గంగా నది అనుకూలంగా ఉంది. నదికి 36 చోట్ల పర్యవేక్షణ విభాగాలు ఉండగా 27 ప్రాంతాల్లో నీరు స్వచ్ఛంగా ఉంది. జలచరాలు సంచరించేందుకు, జీవించేందుకు యోగ్యంగా మారింది. నీటిలో కరిగిన ప్రాణవాయువు (లీటరుకు 6 మి.గ్రా కన్నా ఎక్కువ), జీవరసాయన ప్రాణవాయువు (లీటరుకు 2 మి.గ్రా. కన్నా తక్కువ), మొత్తం కోలిఫామ్‌ స్థాయిలు (100 మి.లీ.కు 5000), పీహెచ్‌ (6.5-8.5) పరామితులను అనుసరించి నదుల ఆరోగ్యాన్ని కొలుస్తారు.

గతంలో ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాలను మినహాయించి బంగాళాఖాతంలో కలిసేవరకు చాలాచోట్ల గంగానదిలో నీరు స్నానానికి అనుకూలంగా లేదు. లాక్‌డౌన్‌ వల్ల పరిశ్రమ ఉద్గారాలు నీటిలో కలవడం తగ్గింది. దాంతో నది ఆరోగ్యం కాస్త మెరుగైందని పర్యావరణ వేత్తలు సంతోషిస్తున్నారు. మరోవైపు ఇది కొంతకాలమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘సరైన సమాచారంతో గంగా నది మెరుగుదలను అంచనా వేయాలి. పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం వస్తోందో లెక్కించేందుకు సీపీసీబీకి ఇదే మంచి సమయం. ప్రమాణాలను నిర్దేశించేందుకు సరైన సమయం’ అని పర్యావరణ వేత్త మనోజ్‌మిశ్రా అంటున్నారు. ‘పరిశ్రమ క్లస్టర్ల వద్ద గంగా నదిలో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గంగా ఉపనదులైన హిందో, యమున నదుల్లోనూ స్వచ్ఛత పెరిగింది’ అని విక్రాంత్‌ తొంగడ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని