NGRI: హెలికాప్టర్‌ తోడుగా నీటి జాడ.. భూగర్భంలో త్రీడీ చిత్రంతో గుర్తించే వీలు

భూగర్భ జలాలను గుర్తించేందుకు సరికొత్త విధానం అందుబాటులోకి వస్తోంది. హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ఇప్పటివరకు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో భూగర్భ జలాలను

Updated : 06 Oct 2021 14:03 IST

హైదరాబాద్‌: భూగర్భ జలాలను గుర్తించేందుకు సరికొత్త విధానం అందుబాటులోకి వస్తోంది. హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ఇప్పటివరకు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో భూగర్భ జలాలను కనిపెట్టడం కోసం ప్రయోగాత్మకంగా హెలీ బోర్న్‌ జియోఫిజికల్‌ మ్యాపింగ్‌ సాంకేతికత (హెలికాప్టర్‌ సర్వే) వినియోగించింది. ఫలితాలు సానుకూలంగా ఉండటంతో సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌బోర్డుతో కలిసి తొలిసారి విస్తృతమైన సర్వేకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా వర్షాభావ ప్రాంతాల్లో 4 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా జియోఫిజికల్‌ మ్యాపింగ్‌ సాంకేతికత వినియోగించి భూగర్భ జలాలను గుర్తించనున్నారు. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణాలో ఈ సర్వే చేయనున్నారు. ఎన్‌జీఆర్‌ఐ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత సహాయంతో భూమి లోపల 500 మీటర్ల వరకు త్రీడీ చిత్రంతో స్పష్టంగా నీటి జాడలు గుర్తించనున్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు, సాగునీరు అందించడానికి తాజా సర్వే ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.150 కోట్లు కేటాయించింది. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మంగళవారం ప్రారంభించారు. ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ వి.ఎం.తివారీ సహా ఈ ప్రాజెక్టులో కీలకంగా ఉన్న శాస్త్రవేత్తల బృందం హైదరాబాద్‌ నుంచి జోథ్‌పూర్‌కు తరలివెళ్లింది.  

ఎలా చేస్తారు..

ఎన్‌జీఆర్‌ఐ ప్రయోగాత్మకంగా రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ద్వారా సర్వే చేసింది. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం సర్వే సాధ్యమైంది. ఫలితాలు పక్కాగా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో చేస్తున్నారు. హెలికాప్టర్‌ కింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన లూప్‌ను వేలాడదీస్తారు. హెలికాప్టర్‌ వెళ్తున్నప్పుడు భూమి లోపల ఎక్కడైనా నీటి జాడలుంటే ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ రేడియేషన్‌ ద్వారా సంకేతాలు అందుతాయి. ఇదంతా ఎప్పటికప్పుడు త్రీడీ మ్యాపింగ్‌ జరుగుతుంది. ప్రాథమిక సమాచారం వేగంగా అందుతుంది. కొద్దిరోజుల్లోనే పూర్తిగా చుట్టేసి రావచ్చు. తర్వాత సమగ్రంగా కావాలంటే గ్రౌండ్‌ సర్వే చేసుకోవచ్చు. హెలికాప్టర్ల స్థానంలో భవిష్యత్తులో డ్రోన్లతో ఈ తరహా సర్వే చేసేలా ఇప్పటికే ప్రొటోటైప్‌ డ్రోన్‌ సాంకేతికతను ఎన్‌జీఆర్‌ఐ అభివృద్ధి చేసింది.

అక్కడే ఎందుకు?

భూగర్భ జల వనరులను గుర్తించేందుకు వాయువ్య భారత్‌ను ఎంపిక చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణాలోని కొన్ని ప్రాంతాల్లో వార్షిక వర్షపాతం 100 మి.మీ. నుంచి 400 మి.మీ. మాత్రమే. ఇక్కడ నివసిస్తున్న కోట్లమంది ప్రజలకు ప్రధాన ఆధారం భూగర్భ జలాలే. ‘భూగర్భ జల వనరులను వేగంగా గుర్తించగలిగితే ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు వీలవుతుంది. సుస్థిరమైన, సమగ్రమైన భూగర్భ జల నిర్వహణ ప్రణాళికల అభివృద్ధికి దోహదం చేస్తుంద’ని ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని