భారీ కుట్రకు రుజువులేమీ లేవు!

గుజరాత్‌ అల్లర్ల (2002) వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణలకు రుజువులేమీ లేవని

Published : 02 Dec 2021 12:37 IST

‘గుజరాత్‌ అల్లర్ల’పై సుప్రీంకు సిట్‌ నివేదన

దిల్లీ: గుజరాత్‌ అల్లర్ల (2002) వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణలకు రుజువులేమీ లేవని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) బుధవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. నాటి అల్లర్ల వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యక్తులు, పోలీసులు, ఉద్యోగుల ప్రమేయం ఉందని చేస్తున్న ఆరోపణలు.. దుర్బుద్ధితో, విషయం ‘చల్లారకుండా ఉండేందుకు’ చేస్తున్నవిగా కనిపిస్తున్నాయని పేర్కొంది. గుజరాత్‌ అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ.. దీనిపై కేసు నమోదు కాలేదంటూ భర్తను కోల్పోయిన జకియా జఫ్రీ అనే మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదును పరిశీలించి చట్ట ప్రకారం వ్యవహరించాల్సిందిగా సుప్రీంకోర్టు గతంలో సిట్‌ను ఆదేశించింది. ఈమేరకు జస్టిస్‌ ఏ.ఎం.ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సి.టి. రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట సిట్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా గుల్బర్గా అల్లర్ల కేసులో ట్రయల్‌ కోర్టు తీర్పును రోహత్గి ఉటంకించారు. ‘‘గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన కేసు విధి నిర్వహణలో కొందరి నిర్లక్ష్యం లేదా ఉల్లంఘనలకు సంబంధించింది అయి ఉండొచ్చు. కానీ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతరుల కుట్రకు సంబంధించినది కాదు’’ అని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని