అంబులెన్స్‌కు డబ్బులు లేవు.. తల్లి మృతదేహాన్ని భుజంపై మోస్తూ..

బెంగాల్‌లోని జల్‌పాయ్‌గుడీలో హృదయవిదారక ఘటన జరిగింది. మహిళ మృతదేహాన్ని భర్త, కొడుకు తమ భుజాలపై మోసుకెళ్లడం చుట్టుపక్కల వారిని కన్నీటి పర్యంతం చేసింది. అంబులెన్స్‌ డ్రైవర్‌ అడిగిన రూ.3 వేలు ఇవ్వలేక వారు ఇలా చేశారు.

Published : 06 Jan 2023 05:55 IST

బెంగాల్‌లోని జల్‌పాయ్‌గుడీలో హృదయవిదారక ఘటన జరిగింది. మహిళ మృతదేహాన్ని భర్త, కొడుకు తమ భుజాలపై మోసుకెళ్లడం చుట్టుపక్కల వారిని కన్నీటి పర్యంతం చేసింది. అంబులెన్స్‌ డ్రైవర్‌ అడిగిన రూ.3 వేలు ఇవ్వలేక వారు ఇలా చేశారు. జల్‌పాయ్‌గుడీలోని క్రాంతి బ్లాక్‌కు చెందిన రాంప్రసాద్‌ అనే వ్యక్తి రోజువారి కూలీ. అతని తల్లి లక్ష్మీరాణి శ్వాసకోశ వ్యాధితో బాధపడేది. దీంతో రాంప్రసాద్‌ ఆమెను జలపాయ్‌గుడీలోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. తల్లి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌ను బేరమాడాడు రాంప్రసాద్‌. అంబులైన్స్‌ డ్రైవర్‌ రూ.3 వేలు ఇస్తే మృతదేహాన్ని ఇంటి దగ్గర దింపుతామని చెప్పాడు. అన్ని డబ్బులు రాంప్రసాద్‌ దగ్గర లేక తల్లి మృతదేహాన్ని తండ్రితో కలిసి భుజంపై మోసుకెళ్లాడు. గ్రీన్‌ జల్‌పాయ్‌గుడీ అనే స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అంకుర్‌ దాస్‌ వీరిని గమనించారు. వెంటనే ఆ సంస్థకు చెందిన అంబులెన్స్‌ను తెప్పించి అందులో మహిళ మృతదేహాన్ని తరలించారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

ఆరోపణలు నిరాధారమైనవి

’’గ్రీన్‌ జల్‌పాయ్‌గుడీ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అంకుర్‌ దాస్‌ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. మృతురాలి కుటుంబీకులు అంబులెన్స్‌ కావాలని వచ్చారు. వారు మేము అడిగిన డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు లేవని చెబితే ఉచితంగా మృతదేహాన్ని వారింటికి తరలించేవాళ్లం. చాలా మంది పేదల మృతదేహాలను ఉచితంగా అంబులెన్సుల్లో దింపాం. ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్ల ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్ర ఇది’’ అని ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ దిలీప్‌ దాస్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని