సొంత పిల్లలపై కోపం.. రూ.కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసేసిన వృద్ధుడు

సొంత పిల్లలపై కోపంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నాథూ సింగ్‌ అనే 85 ఏళ్ల వృద్ధుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

Updated : 07 Mar 2023 12:22 IST

ముజఫర్‌పుర్‌: సొంత పిల్లలపై కోపంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నాథూ సింగ్‌ అనే 85 ఏళ్ల వృద్ధుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రూ.1.5 కోట్లు విలువ చేసే తన ఆస్తిని ప్రభుత్వం పేరిట వీలునామా రాశారు. తాను మరణించిన తర్వాత శవాన్ని వైద్యకళాశాలకు అప్పగించాలని కోరారు. తన కుమారుడు, కుమార్తెలు కనీసం తన శవాన్ని కూడా తాకొద్దని వీలునామాలో పేర్కొనడం గమనార్హం.

ముజఫర్‌పుర్‌కు చెందిన నాథూసింగ్‌కు ఓ ఇల్లుతో పాటు స్థలం కూడా ఉంది. వాటి విలువ రూ.1.5 కోట్లు. ఆయనకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లయ్యాయి. కుమారుడు సహరాన్‌పుర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భార్య చనిపోయిన తర్వాత నాథూ సింగ్‌ చాలా కాలం ఒంటరిగానే గడిపారు. ఏడు నెలల క్రితం సొంత ఊళ్లోనే ఉన్న ఓ వృద్ధాశ్రమానికి మారారు. కనీసం చూడడానికి కూడా తనవారెవరూ రాకపోవడంతో నాథూ సింగ్‌ మనసు విరిగింది. తన ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వం పేరిట రాయాలని నిశ్చయించుకున్నారు. తన మరణం తర్వాత ఆ స్థలంలో ఆసుపత్రి, పాఠశాల నిర్మించాలని కోరారు.

‘‘ఈ వయసులో నేను నా కొడుకు, కోడలితో ఉండాల్సింది. కానీ, వాళ్లు నన్ను బాగా చూసుకోవడం లేదు. అందుకే నేను నా ఆస్తిని ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని నాథూ సింగ్‌ ఓ మీడియా సంస్థకు తెలిపారు. నాథూ సింగ్‌ నుంచి తమకు అఫిడవిట్‌ అందిందని స్థానిక సబ్‌-రిజిస్ట్రార్‌ తెలిపారు. ఆయన మరణం తర్వాత ఆ వీలునామా అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని