జీ-20 సమావేశం వ్యూహాల ఖరారుకు నేడు అఖిలపక్ష భేటీ

వచ్చే ఏడాది సెప్టెంబరులో మన దేశం ఆతిథ్యమిచ్చే జీ-20 సమావేశానికి వ్యూహాల ఖరారుపై చర్చించేందుకు కేంద్రం సోమవారం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది.

Published : 05 Dec 2022 04:37 IST

దిల్లీ, ఉదయ్‌పుర్‌: వచ్చే ఏడాది సెప్టెంబరులో మన దేశం ఆతిథ్యమిచ్చే జీ-20 సమావేశానికి వ్యూహాల ఖరారుపై చర్చించేందుకు కేంద్రం సోమవారం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షత వహించే దీనికి 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో పాల్గొనేందుకు టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను మన దేశం ఈ నెల 1న అధికారికంగా చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 9, 10 తేదీల్లో దిల్లీలో జీ-20 కూటమి సమావేశం జరగనుంది. కూటమిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, భారత్‌, ఇండోనేసియా, ఇటలీ, జపాన్‌, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, బ్రిటన్‌, అమెరికా, ఐరోపా సమాజం(ఈయూ) సభ్య దేశాలుగా ఉన్నాయి. మరోపక్క సాంకేతిక పరివర్తన, హరిత అభివృద్ధి, మహిళా నేతృత్వ అభివృద్ధి వంటి అంశాలపై చర్చించేందుకు మనదేశం నేతృత్వంలో జీ-20 మొదటి షేర్పా సమావేశం ఆదివారం ఉదయ్‌పుర్‌లో మొదలైంది.  

నా స్నేహితుడు మోదీపై నాకు నమ్మకమే: మెక్రాన్‌

లండన్‌: జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ సమర్థంగా నిర్వహించగలదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ధీమా వ్యక్తం చేశారు. శాంతి, సుస్థిరతలతో కూడిన ప్రపంచ నిర్మాణంలో నా మిత్రుడు, భారత ప్రధాని  మోదీ అందరిని కలుపుకొని వెళ్తారనే విశ్వాసం తనకు ఉందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని