Corona Virus: ఆ దేశాల నుంచే వచ్చే వారికి.. RT-PCR రిపోర్ట్‌ తప్పనిసరి

కరోనా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ నివేదిక తప్పనిసరి చేసింది.

Published : 29 Dec 2022 15:56 IST

దిల్లీ: పలు దేశాల్లో కొవిడ్‌ (Covid 19) విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌ (RT-PCR) నెగెటివ్‌ నివేదిక తప్పనిసరి చేసింది. కొత్త సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) గురువారం వెల్లడించారు.

‘‘చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు జనవరి 1, 2023 నుంచి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష నివేదిక తప్పనిసరి. ఆ దేశాల నుంచి వచ్చే వారు ప్రయాణానికి ముందు ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో తమ వైరస్‌ నెగెటివ్‌ (RT-PCR) నివేదికను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలి’’ అని మాండవీయ వెల్లడించారు. ప్రయాణానికి ముందు 72 గంటల్లోగా ఈ పరీక్ష చేయించుకుని నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే ఎయిర్‌పోర్టుల్లో అమల్లో ఉన్న 2శాతం మందికి రాండమ్ పరీక్షల నిబంధనకు ఇది అదనమని పేర్కొన్నారు.

చైనా (China) సహా పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా విదేశాల నుంచి వచ్చే విమానాల్లో 2 శాతం మంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో రాండమ్‌ కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.

ఇక, దేశంలో ప్రస్తుతం కరోనా (Corona Virus) వ్యాప్తి అదుపులోనే ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.11శాతంగా ఉంది. అయినప్పటికీ వచ్చే 40 రోజులు కీలకమని ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. అయితే దేశంలో మరో కొవిడ్ వేవ్‌ వచ్చినప్పటికీ.. ఈ సారి వైరస్‌ తీవ్రత తక్కువగానే ఉండొచ్చన్న అంచనాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని