Kedarnath: కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్..!

భారీ వర్షాల కారణంగా ప్రసిద్ధ కేదార్‌నాథ్‌ (Kedarnath) యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యాత్రికులను అనుమతించొద్దని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదేశించారు.

Updated : 25 Jun 2023 17:30 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖాండ్‌లో (Uttarakhand) భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత అధికమయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రసిద్ధ కేదార్‌నాథ్‌ (kedarnath) యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యాత్రకు అనుమతించొద్దని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి (Pushkar Singh Dhami) అదేశించారు. ఈ మేరకు రుద్రప్రయాగ కలెక్టర్ మయూర్‌ దీక్షిత్‌ వెల్లడించారు. ఇప్పటికే బయల్దేరి వెళ్తున్న యాత్రికులను సోన్‌ప్రయాగ వద్ద  నిలిపివేశారు. వారు తలదాచుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

మరోవైపు రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రాన్ని సీఎం పుష్కర్‌ సింగ్‌ధామి అకస్మాత్తుగా సందర్శించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సన్నద్ధతపై ఆరా తీశారు. ఇవాళ ఉదయం 8 గంటల వరకు 5828 మంది యాత్రికులు సోన్‌ప్రయాగ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.  కేవలం రుద్రప్రయాగ, సోన్‌ప్రయాగ, కేదార్‌నాథ్‌ ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ చోట్ల భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

గడిచిన 24 గంటల్లో హరిద్వార్‌లో అత్యధికంగా 78 మి.మీ వర్షం కురిసినట్లు వాతావరణశాఖ చెబుతోంది. దేహ్రాదూన్‌లో 33.2 మి.మీ., ఉత్తరకాశీలో 27.7 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అయా జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని, రెస్క్యూ ఆపరేషన్లకు సన్నద్ధం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని