BlackFungus: దేశంలో 2,100 మంది మృతి

కరోనా రెండో దశ ఉద్ధృతి నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న భారత్‌లో బ్లాక్‌ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌) వ్యాధి కలవరపెడుతోంది. గత మూడు వారాలుగా ఈ కేసుల సంఖ్య భారీగా

Published : 11 Jun 2021 14:54 IST

దిల్లీ: కరోనా రెండో దశ ఉద్ధృతి నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న భారత్‌లో బ్లాక్‌ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌) వ్యాధి కలవరపెడుతోంది. గత మూడు వారాలుగా ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 31,216 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు కాగా.. 2,109 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాల గణాంకాలు చెబుతున్నాయి.

అత్యధికంగా మహారాష్ట్రలో 7,057 కేసులు నమోదుకాగా.. 609 మంది మరణించారు. ఆ తర్వాత గుజరాత్‌లో 5,418 కేసులు వెలుగుచూడగా.. 323 మందిని బ్లాక్‌ ఫంగస్‌ బలితీసుకుంది. 2,976 కేసులతో రాజస్థాన్‌ మూడో స్థానంలో ఉండగా.. కర్ణాటకలో 188 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీల్లోనూ వెయ్యికి పైనే కేసులు నమోదయ్యాయి. బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిన్‌-బి ఔషధం కొరత వల్లే కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 

కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్ ముప్పుగా పరిణమించింది. ఇదేమీ కొత్తవ్యాధి కాకపోయినా.. దీనిబారిన పడినవారికి అతి తక్కువ రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహులకు ఇది ప్రమాదంగా మారుతోంది. స్టెరాయిడ్లు ఎక్కువ తీసుకున్నవారికి కూడా బ్లాక్‌ఫంగస్‌ ముప్పు ఎక్కువగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఫంగల్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని అంటువ్యాధుల చట్టం (ఎపిడెమిక్‌ డిసీజెస్ యాక్ట్‌) కింద పరిగణించాలని కేంద్రం కొద్దిరోజుల క్రితం రాష్ట్రాలను ఆదేశించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీన్ని అంటువ్యాధిగా ప్రకటించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని