Odisha Train Accident: ఎన్డీఆర్‌ఎఫ్‌ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..

బాలేశ్వర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైన నిమిషాల్లోనే ఓ ఎన్డీఆర్‌ఎఫ్‌ జవాను చాలా చాకచక్యంగా వ్యహరించాడు. ఫలితంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వేగంగా ఘటనా స్థలికి చేరుకోగలిగాయి.

Updated : 04 Jun 2023 11:16 IST

ఇంటర్నెట్‌డెస్క్: షాలీమార్‌-చెన్నై కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైన దాదాపు అర్ధగంటలోపే ఎన్డీఆర్‌ఎఫ్‌ తొలి బృందం ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ బృందం అంత వేగంగా అక్కడకు చేరుకోవడానికి కోరమాండల్‌లో ప్రయాణిస్తున్న ఓ ఎన్డీఆర్‌ఎఫ్‌ జవాన్‌ కారణం. ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే జీపీఎస్‌ లొకేషన్‌, ప్రమాదం ఫొటోలను ఉన్నతాధికారులకు చేరవేశాడు.

వెంకటేశన్‌ ఎన్‌కె అనే 39 ఏళ్ల జవాన్‌ తన బంధువు పెళ్లిలో పాల్గొనేందుకు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. అతడికి బీ-7 కోచ్‌లోని 68 నెంబర్‌ సీటు వచ్చింది. ప్రయాణం మొదలుకాగానే అతడు తన ఫోన్‌లో నిమగ్నమయ్యాడు. రాత్రి దాదాపు 7 గంటల సమయంలో రైలు భారీ శబ్దంతో కుదుపులకు లోనైంది. ఎదురుగా స్లీపర్‌ బెర్తులో పడుకొన్న వ్యక్తి కిందపడ్డాడు. మరోవైపు ఓ తల్లిచేతిలో ఉన్న బిడ్డ కిందపడింది.. దీంతో భారీ బాంబుపేలుడు జరిగిందేమోనని భావించిన వెంకటేశన్‌ అప్రమత్తం అయ్యాడు. వెంటనే రైలు బోగి నుంచి బయటపడ్డాడు. ఫోన్‌లో టార్చ్‌ను ఆన్‌ చేసి.. అక్కడ దృశ్యాన్ని చూసిన వెంటనే కోచ్‌ల్లో చిక్కుకొన్న వారిలో కొందరిని కాపాడాడు. ఆ చప్పుడు విని అక్కడకు చేరుకొన్న స్థానికులకు పలు సూచనలు చేశాడు.

కానీ, పరిస్థితి ఘోరంగా ఉండటంతో.. వెంటనే తన పై అధికారి అయిన ఇన్‌స్పెక్టర్‌కు ఈ విషయాన్ని ఫోన్‌లో తెలియజేశాడు. దీంతోపాటు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొన్నాడు. ప్రమాదం ఫొటోలను అధికారులకు చేరవేశాడు. కొద్దిసేపటి తర్వాత జీపీఎస్‌ లొకేషన్‌ కూడా షేర్‌ చేశాడు. ఈ ఘటనపై ఎన్డీఆర్‌ఎఫ్‌ డీఐజీ మొహిసీన్‌ షాహెది మాట్లాడుతూ.. ‘‘వెంకటేశన్‌ తొలుత మాకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే మా హెడ్‌క్వార్టర్స్‌లోని సీనియర్‌ అధికారి అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన పావుగంటలోనే బాలేశ్వర్‌లోని తొలి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలికి చేరింది. ఆ తర్వాత మిగిలిన బృందాలు కూడా అక్కడకు వచ్చాయి’’ అని వెల్లడించారు. దాదాపు 300 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రైలు ప్రమాదం జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని