NIA: ప్రధాని హత్యకు కుట్రకేసులో ఎన్‌ఐఏ దాడులు..!

గతేడాది ప్రధాని మోదీ హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ తాజాగా ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తు తీవ్రం  చేసింది. బుధవారం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో 16 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 

Published : 31 May 2023 12:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2022 జులైలో పట్నాలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హత్య చేయాలన్న పీఎఫ్‌ఐ(PFI ) కుట్రపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ(NIA ) తాజాగా కర్ణాటక( Karnataka)లోని 16 చోట్ల దాడులు నిర్వహించింది. ఈ కుట్రకు సంబంధించి పుట్టూరు, కుర్నాడక్‌, కుంబ్ర, తారిపాడ్పు గ్రామాల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. అనుమానితులుగా మహమ్మద్‌ హారిస్‌, సాజిద్‌ హుస్సేన్‌, ఫైజల్‌ అహ్మద్‌, సంషుద్దీన్‌లను గుర్తించారు. గతేడాది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పీఎఫ్‌ఐపై చేసిన దాడుల్లో ఆ సంస్థ సభ్యుడు షషీక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. పీఎఫ్‌ఐ సంస్థ 12 జులై 2022 నాడు ప్రధాని మోదీని పట్నాలో హత్య చేయడానికి కుట్రపన్నినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. అంతేకాదు.. పీఎఫ్‌ఐ మరిన్ని టెర్రర్‌ మాడ్యూల్స్‌, దాడులకు ప్లాన్‌ చేస్తున్నట్లు వెల్లడించింది

నేడు దక్షిణ కన్నడ జిల్లాలోని 16 చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేసి ఈ కుట్రకు సంబంధించిన పలు పత్రాలను స్థానికుల సాయంతో వెరిఫికేషన్‌ చేసింది. పుత్తూరు, బెల్టంగాడి, వెనూరు వంటి ప్రదేశాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. పీఎఫ్‌ఐ ప్రతినిధులకు చెందిన ఇళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల్లో ఇవి జరిగాయి.   గల్ఫ్‌ దేశాల నుంచి అందే సొమ్ముతో పీఎఫ్‌ఐ భారత్‌లో ఉగ్రవాదానికి పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ భారత దేశంలో పీఎఫ్‌ఐ హవాల నెట్‌వర్క్‌ను పెకలించేందుకు ఈ దాడులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

2022లో పట్నాలోని పుల్వార్‌ షరీఫ్‌  వద్ద ఐదుగురు వ్యక్తులు జాతి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఈ దాడిలో చాలా కీలక పత్రాలు బయటపడ్డాయి. వీటిల్లో పీఎఫ్‌ఐ మిషన్‌ 2047 కూడా ఉంది.  తాజాగా పీఎఫ్‌ఐ నెట్‌ వర్క్‌ దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నట్లు అంచనాకు వచ్చి ఎన్‌ఐఏ ఈ దాడులు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని