టీకా వేయించుకున్నా..మాస్కులు ఎందుకంటే..?

కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి.

Published : 07 Jan 2021 18:34 IST

దిల్లీ: కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. భారత ప్రభుత్వం మొదటి దశలో భారీ సామూహిక టీకా కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తోంది. ఇక, టీకా తీసుకోవడమే ఆలస్యం..మాస్కులు అవతలకు విసిరివేయవచ్చన్న భ్రమ మాత్రం వద్దంటున్నారు నిపుణులు. కరోనావైరస్ బారిన పడకుండా మాస్కులు ధరించాల్సిందేనని వారు సూచిస్తున్నారు. 

‘మనం మాస్కులను పూర్తిగా అవతలపడేయడానికి ఇంకా 6-12 నెలల సమయం పట్టొచ్చు.  ఇప్పటికే భారత్ భారీ టీకా కార్యక్రమానికి ప్రణాళికలు రచిస్తున్నప్పటికీ, 2022 ప్రారంభంలో మాత్రమే సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిందే. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఉండటం ముఖ్యం’ అని ముంబయి హిందుజా ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ హెడ్ భరేశ్ దేధియా సూచించారు. టీకా డోసుల వల్ల 100 శాతం రక్షణ లభించకపోవడం, వైరస్‌ జన్యువుల్లో మార్పులు సంభవిస్తుండటం వల్ల టీకా తీసుకున్నా కూడా మాస్కులు ధరించాల్సి ఉంటుందని అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఒకరు వెల్లడించారు. టీకాలు తీసుకున్న వ్యక్తికి రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందడానికి సుమారు రెండు వారాల దాకా పట్టొచ్చని వైద్యాధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతో ఆ సమయంలోగా టీకా తీసుకున్న వ్యక్తి కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు. 

మాస్క్‌లు ఎందుకు ధరించాలంటే..

* మొదటగా టీకాలు 100 శాతం సమర్థవంతమైనట్లుగా వెల్లడికాలేదు. మానవ దశ ప్రయోగాల్లో ఆస్ట్రాజెనికా టీకా సామార్థ్యం 70 శాతమని వెల్లడైన సంగతి తెలిసిందే. మరోవైపు, భారత్‌లో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌పై అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయి.
* ఇప్పటివరకు చేసిన అధ్యయనాలన్నింటిని కొవిడ్‌ -19 వ్యాధిని దృష్టిలో పెట్టుకొనే రూపొందించారు. సిద్ధాంత పరంగా టీకా పొందిన వ్యక్తికి వైరస్ సోకుతుంది. కానీ, వ్యాధి రాదు. అలా వైరస్ సోకిన వ్యక్తులు దాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉంది. అందుకే మాస్కులు ధరించడం తప్పనిసరని నిపుణులు వెల్లడిస్తున్నారు. మెజార్టీ వ్యక్తులకు టీకాల పంపిణీ లేక వేగంగా వైరస్ వ్యాప్తి వలనో హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చే వరకు ఈ జాగ్రత్తలు ఆవశ్యకమని సూచిస్తున్నారు. 

ఇవీ చదవండి:

కరోనా: పరిస్థితులు మరింత దిగజారనున్నాయి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని