Mann Ki Baat: అమరవీరుల కోసం ‘మేరీ మాటి మేరా దేశ్‌’.. మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రకటన

దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించుకునేందుకు కొత్త ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు మన్‌ కీ బాత్‌ (Mann Ki Baat)లో ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రకటించారు. 

Updated : 30 Jul 2023 14:06 IST

దిల్లీ:  ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ (PM Narendra Modi) ‘మన్‌ కీ బాత్’ (Mann Ki Baat) కార్యక్రమం ద్వారా ఆల్‌ ఇండియా రేడియోలో మాట్లాడుతారు. ఈ వారం 103 ఎపిసోడ్‌లో మోదీ కీలక ప్రకటన చేశారు. ‘మేరీ మాటి మేరా దేశ్‌’ (Meri Mati Mera Desh) పేరుతో కొత్త ప్రచారానికి  శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించుకునేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

అక్రమ వలసదారులను గుర్తించేందుకు మణిపుర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

‘‘అమరవీరులకు గౌరవ సూచకంగా దేశంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక శాసనాలను ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు అమృత్‌ కలశ యాత్ర (Amrit Kalash Yatra) పేరుతో  దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో మట్టి, మొక్కలను సేకరించి దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం (National War Memorial) పక్కనే అమృత్‌ వాటిక (Amrit Vatika) పేరుతో ప్రత్యేక స్థూపాన్ని నిర్మించనున్నాం. ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ (Ek Bharat Shresth Bharat,)కు ప్రతీకగా ఈ అమృత్‌ వాటిక నిలుస్తుంది’’ అని ప్రధాని తెలిపారు. అకాల వర్షాల కారణంగా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో సంభంవించిన వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడిన తీరును ప్రధాని అభినందించారు.

మన్‌ కీ బాత్‌లోని మరికొన్ని అంశాలు

  • ఈ కార్యక్రమంలో అమెరికాకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన పర్యటన సందర్భంగా భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100కుపైగా కళాఖండాలను అమెరికా తిరిగి వెనక్కు ఇచ్చిందని చెప్పారు. 2016, 2021లో తన అమెరికా పర్యటన సందర్భంగా కూడా అమెరికా కొన్ని కళాఖండాలను భారత్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు.
  • సుమారు రూ. 12 వేల కోట్ల విలువైన 10 లక్షల కేజీల మత్తు పదార్థాలను భారత్ నాశనం చేసి రికార్డు సృష్టించిందని ప్రధాని మోదీ వెల్లడించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా దేశ యువత సమష్టిగా చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. 
  • ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఒక్క రోజులో 30 కోట్ల మొక్కలు నాటి రికార్డు నెలకొల్పారని, ప్రజా భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. భారత్‌లోని యాత్రా స్థలాలకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారని, కాలిఫోర్నియా నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు ఇద్దరు విదేశీ యాత్రికులు వచ్చారని ప్రధాని చెప్పారు. 
  • గతేడాది అక్టోబర్‌లో ఉత్తరాఖండ్‌ మహిళల నుంచి తాను ప్రత్యేకంగా అందుకున్న భోజ్‌పత్ర (Bhojpatra) గురించి ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. విభిన్నమైన కళాకృతిని భోజ్‌పత్రంపై వారు తనకు బహూకరించినట్లు తెలిపారు. పురాతన కాలం నుంచి గ్రంథాలు, పుస్తకాలను భోజ్‌పత్రాలలోనే భద్రపరుస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఉతర్తాఖండ్‌కు వెళ్లే పర్యాటకులు స్థానిక ఉత్పత్తులను ఎక్కువగా కొనేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఐరోపా, ఆసియాతోపాటు హిమాలయాల్లో పెరిగే బెతులా యుటిలిస్‌ లేదా హిమాలయన్‌ బిర్చ్‌ అనే మొక్క బెరుడునే భోజ్‌పత్ర అని పిలుస్తారు. కాగితం కనిపెట్టక ముందు ఈ చెట్టు బెరుడుపైనే గ్రంథాలు రాసేవారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు