₹850 చెల్లిస్తే  ₹5లక్షల ఆరోగ్య బీమా! 

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ వెల్లడించారు. మే 1 నుంచి ప్రతికుటుంబానికి సార్వత్రిక ఆరోగ్య.......

Published : 28 Mar 2021 01:35 IST

రాజస్థాన్‌లో మే 1న సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం ప్రారంభం 

జైపూర్‌: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ వెల్లడించారు. ప్రతి కుటుంబానికి సార్వత్రిక ఆరోగ్య బీమా వర్తింపు పథకాన్ని మే 1న ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబం ఏడాదికి రూ.850లు చెల్లించి రూ.5లక్షల మేర బీమా కవరేజ్‌ పొందవచ్చని పేర్కొన్నారు. శనివారం వైద్య విద్యాశాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గహ్లోత్‌ మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్యరంగమే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు. అభివృద్ధి పనులు, తాగునీరు, విద్యుత్‌, విద్య, నీటిపారుదల, సాంఘిక సంక్షేమం, ఇతర రంగాలు కూడా తమ ప్రాధాన్య జాబితాలో ఉన్నాయని చెప్పారు. తాము చేపట్టిన నో మాస్క్‌ నో ఎంట్రీ విధానాన్ని యూకే కూడా అనుసరించిందని తెలిపారు.

2019 డిసెంబర్‌లో తమ ప్రభుత్వం చేపట్టిన ‘నిరోగి రాజస్థాన్‌’ క్యాంపెయిన్‌ 2020 మార్చిలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎంతో కీలకంగా మారిందన్నారు. రాష్ట్రంలో కరోనాను విజయవంతంగా నియంత్రించామని చెప్పారు. రాజస్థాన్‌లో కరోనా రికవరీ రేటు అధికంగా, మరణాల రేటు తక్కువగా ఉందని చెప్పారు. వైద్య వసతులను బలోపేతం చేశామని..  ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ టెస్ట్‌ల సామర్థ్యం 70వేలుగా ఉందని చెప్పారు. 

లాక్‌డౌన్‌ పరిష్కారం కాదు
కరోనా సెకెండ్‌ వేవ్‌పై ఆందోళన వ్యక్తంచేసిన గహ్లోత్‌.. రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఆంక్షలు విధించిందన్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. లాక్‌డౌన్‌ నష్టాలకు కారణమవుతుందని.. వైరస్‌ కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని