
Supreme Court: దంపతులిద్దరూ విషం తాగితే భర్తను శిక్షించడం తగదు: సుప్రీంకోర్టు తీర్పు
దిల్లీ: దంపతులిద్దరూ విషం తాగిన సందర్భంలో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ భర్తకు శిక్ష విధించడం సరికాదని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆత్మహత్య చేసుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితులు కల్పించినప్పుడే.. ప్రేరేపించార[ని భావించి శిక్ష వేయాల్సి ఉంటుందని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే తమిళనాడుకు చెందిన వేలుదురైకు వివాహం జరిగి 25 ఏళ్లు కాగా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య గొడవ జరగగా, అనంతరం ఇద్దరూ పురుగుమందు తాగారు. ఆమె చనిపోగా, ఆయన బతికాడు. దాంతో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ ఆయనకు సెక్షన్ 306 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు కూడా ఇందుకు ఆమోదించింది. సుప్రీంకోర్టు మాత్రం ఏకీభవించలేదు. ఇద్దరూ ఆత్మహత్యయత్నం చేశారని, అందువల్ల భర్త ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా భావించలేమని తెలిపింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తప్ప, ఇతరత్రా సంఘటనలు జరిగినట్టు నిరూపించలేదని పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.