Lakhimpur Kheri: ప్రియాంకా గాంధీపై కేసు నమోదు.. రెండో రోజూ నిర్బంధంలోనే!

శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే కారణంగా ప్రియాంకా గాంధీతో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశామని స్థానిక హర్గావున్‌ పోలీసులు పేర్కొన్నారు.

Published : 05 Oct 2021 17:31 IST

ఆందోళనలకు దిగుతోన్న కాంగ్రెస్‌ నేతలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో నలుగురు రైతులు మృతి చెందిన అనంతరం రెండో రోజు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రాను లఖింపుర్‌ చేరకముందే అడ్డుకున్న పోలీసులు.. ఓ గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే కారణంగా ఆమెతో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశామని స్థానిక హర్గావున్‌ పోలీసులు పేర్కొన్నారు.

ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌, వారెంట్‌ లేకుండానే పోలీసులు 28గంటలుగా తనను నిర్బంధించారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఉదయం ఓ వీడియో విడుదల చేశారు. ఇదే సమయంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు లఖ్‌నవూ వచ్చిన ప్రధాని మోదీ.. బాధిత కుటుంబాలను పరామర్శించాలని ఆమె డిమాండ్‌ చేశారు. మరోవైపు తమ నేతను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ నిర్బంధించడంపై యూపీ పోలీసులు స్పందించారు. సెక్షన్‌ 144 అమలులో ఉన్న సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోనే ఆమెతో పాటు మరో పదిమందిపై ఐపీసీ సెక్షన్‌ 107/16 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే, అక్టోబర్‌ 4వ తేదీ ఉదయమే ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకొగా.. ప్రస్తుతం ఆమె ఉన్న సీతాపూర్‌లోని పీఏసీ గెస్ట్‌హౌస్‌నే తాత్కాలిక జైలుగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను తెలియజేస్తూ జిల్లా మెజిస్ట్రేట్‌కు హర్గావున్‌ పోలీసులు నివేదిక అందించినట్లు తెలస్తోంది.

కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీని నిర్బంధించడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ఉదయం 4.30 ప్రాంతంలో ప్రియాంకా గాంధీని అరెస్టు చేయడం అక్రమణం, సిగ్గుచేటు అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం విమర్శించారు. అంతేకాకుండా ఇప్పటివరకూ మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇక ప్రియాంక గాంధీని కలిసేందుకు సీతాపూర్‌ బయలుదేరిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ను లఖ్‌నవూ విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఎయిర్‌పోర్టులోనే సీఎం బైఠాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని