Corona: లండన్‌లో ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా..!

కరోనా వైరస్ విజృంభణతో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన దగ్గరి నుంచి రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.

Updated : 25 Dec 2021 17:09 IST

ఒమిక్రాన్ వేళ.. బ్రిటన్‌లో రికార్డు స్థాయి కరోనా కేసులు

లండన్‌: కరోనా వైరస్ విజృంభణతో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన దగ్గరి నుంచి రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. అక్కడ వరుసగా మూడోరోజు లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల సంఖ్య 1,22,186కి చేరింది. మరీ ముఖ్యంగా బ్రిటన్‌ రాజధాని లండన్‌లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్‌ఎస్‌) అంచనాల ప్రకారం.. డిసెంబర్ 16 నాటికి రాజధాని నగరంలో ప్రతి 20 మందిలో ఒకరు కొవిడ్ బారినపడి ఉండొచ్చని తెలిపింది. అలాగే ఆదివారం నాటికి ప్రతి పది మందిలో ఒకరు కొవిడ్ బారిన పడే అవకాశం ఉండొచ్చని ముందస్తు అంచనాలను వెల్లడించింది.

మునుపటి వేరియంట్ల కంటే ఒమిక్రాన్‌తో ఆసుపత్రిలో చేరే ప్రమాదం తక్కువగా ఉందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. అయితే అక్కడి వైద్యులు మాత్రం పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేనందున పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఆ దేశంలో శుక్రవారం 137 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు కంటే మరణాలు(147) తగ్గాయి. మొత్తంగా 1,47,857 మంది మరణించారు. ఇది ఐరోపాలోనే అత్యధికం కావడం గమనార్హం.  

యూకే మొత్తంలో స్కాట్లాండ్‌లోనే ఇన్ఫెక్షన్‌ రేటు తక్కువగా ఉన్నట్లు ఓఎన్‌ఎస్‌ వెల్లడించింది. డిసెంబర్ 19 నాటికి అక్కడ ప్రతి 65 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు తెలిపింది. ఇంగ్లండ్‌లో ప్రతి 35 మందిలో ఒకరికి ఈ వైరస్ సోకి ఉంటుందని అంచనా వేసింది. ఆదివారం నాటికి ఆ పరిస్థితి 25 మందిలో ఒకరు స్థాయికి చేరనుందని పేర్కొంది. మరోపక్క కొవిడ్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళ్తుండటంతో..పరిశ్రమలు, రవాణా సంస్థలు సిబ్బంది కొరతతో సతమతం అవుతున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని