
Modi US Visit: ఉగ్రవాదంపై చర్చ.. పాక్ పాత్రను స్వయంగా ప్రస్తావించిన కమల
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మొదటి సారి భేటీ అయ్యారు. ఇరువురి మధ్య మొదటి రోజు పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఉగ్రవాద సమస్య గురించి మాట్లాడుతూ.. హారిస్ స్వయంగా పాకిస్థాన్ ప్రస్తావనను తీసుకువచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం మద్దతు ఇవ్వడం మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. దీనికి సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా మీడియాకు వెల్లడించారు.
‘ఉగ్రవాదం సమస్య చర్చకు వచ్చినప్పుడు.. అమెరికా ఉపాధ్యక్షురాలు పాకిస్థాన్ పాత్రను స్వయంగా ప్రస్తావించారు. ఉగ్రసంస్థలకు పాకిస్థాన్ ఇస్తోన్న మద్దతును నిశితంగా పర్యవేక్షించాల్సి ఉందన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలపై పాక్ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే కొన్ని దశాబ్దాలుగా భారత్ బాధితురాలిగా ఉందని మోదీ వాస్తవాన్ని వెల్లడించగా.. ఆమె అంగీకరించారు’ అని ష్రింగ్లా వెల్లడించారు. అలాగే ఇటీవల చోటుచేసుకున్న పలు అంతర్జాతీయ పరిణామాలపై మోదీ, కమల తమ అభిప్రాయాలు పంచున్నారని చెప్పారు.
మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా.. మొదటి రోజు కమలా హారిస్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో మోదీ సమావేశమయ్యారు. ప్రముఖ సంస్థల సీఈఓలతో చర్చలు జరిపారు. ఇక రెండో రోజు అధ్యక్షుడు జో బైడెన్, క్వాడ్ నేతలతో భేటీ కానున్నారు.