Dress code Row: ఏది సర్వోన్నతం.. దేశమా.. మతమా?: మద్రాస్‌ హైకోర్టు ఆందోళన

దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్న ధోరణులపై మద్రాస్‌ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. దేశమా? మతమా.. ఏది అత్యున్నతమైందంటూ....

Published : 11 Feb 2022 01:31 IST

చెన్నై: దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్న ధోరణులపై మద్రాస్‌ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. దేశమా? మతమా.. ఏది అత్యున్నతమైందంటూ ప్రశ్నించింది. కర్ణాటకలో హిజాబ్‌ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ ఆలయాల్లోకి హిందూయేతరులను నిషేధించాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారించింది.  ఈ సందర్భంగా హైకోర్టు యాక్టింగ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్‌. భండారీ, జస్టిస్ డి.భరత్‌ చక్రవర్తిలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో కొన్ని శక్తులు డ్రెస్‌ కోడ్‌కు సంబంధించిన వివాదాలను లేవనెత్తుతున్నాయనీ.. ఇది దేశమంతా పాకుతోందంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ‘‘ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది. ఒకరు 'హిజాబ్' కోసం, మరికొందరు టోపీ కోసం.. ఇంకొందరు ఇతర అంశాల కోసం వెళ్తున్నారు. ఇది ఒక దేశమా లేదంటే మత ప్రాతిపదికన విభజించబడిందా? జరుగుతున్న పరిణామాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి’’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. భారతదేశం లౌకిక దేశమనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్న యాక్టింగ్ సీజే.. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలు మతం పేరుతో  దేశాన్ని విభజించే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన రంగరాజన్‌ నరసింహన్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో భక్తులకు డ్రెస్‌కోడ్‌ను ఖచ్చితంగా అమలు చేయాలంటూ పిటిషనర్‌ ఈ పిల్‌లో న్యాయస్థానాన్ని కోరారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లోకి హిందూయేతరులు అడుగు పెట్టకుండా, దేవాలయాల ప్రాంగణంలో వాణిజ్య కార్యకలాపాలను నిషేధించాలంటూ ఆదేశాలివ్వాలని కోరారు. దీంతో పాటు దేవాలయాల ప్రవేశ ద్వారం వద్ద హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ, డ్రెస్‌ కోడ్‌ను నిర్దేశిస్తూ డిస్‌ప్లే బోర్డులను సైతం ఏర్పాటు చేసేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లేనప్పుడు, వాటిపై డిస్‌ప్లే బోర్డులు పెట్టడమెలా అనే ప్రశ్న తలెత్తుతుందని బెంచ్‌ ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అయితే, పిటిషనర్‌ తీర్పు కోసం పట్టుబట్టడంతో తన అభ్యర్థనకు తగిన ఆధారాలు సమర్పించాలని న్యాయస్థానం సూచించింది.  ప్యాంటు, ధోతీ, చొక్కాలను ధరించాలని ఏ ఆగమ శాస్త్రం సూచిస్తోందని ప్రశ్నించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ ధోరణిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది.

మరోవైపు, ఒక్కో దేవాలయం ఒక్కో ఆచారాన్ని అనుసరిస్తోందని, ఇతర మతాలకు చెందిన సందర్శకులను 'ధ్వజ స్తంబం' (ఫ్లాగ్ మాస్ట్) వరకు మాత్రమే అనుమతిస్తున్నట్టు తమిళనాడు అడ్వొకేట్‌ జనరల్‌ ఆర్‌. షణ్ముగసుందరం కోర్టుకు తెలిపారు. డ్రెస్‌ కోడ్‌ను నిర్దేశిస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఇప్పటికే మద్రాస్‌ హైకోర్టు పక్కనపెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇది ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తోందని పేర్కొన్నారు. అయితే, డ్రెస్‌కోడ్‌కు సంబంధించిన ఉదాహరణలను పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు అనుమతించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని