Yogi Adityanath: అలాంటి వారికి హారతి ఇవ్వాలా..?: సీఎం యోగి

నేరస్థుల ఇళ్లపై ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్‌ ఆపరేషన్‌ను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమర్థించారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వారికి హారతులు పట్టాలా..? అంటూ మండిపడ్డారు. 

Published : 01 Aug 2023 11:54 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో బుల్డోజర్లతో నేరస్థుల ఇళ్ల కూల్చివేతను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) సమర్థించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బుల్డోజర్లతో నేరస్థుల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోందని అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందిస్తూ.. అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వారికి హారతి ఇవ్వాలా? అంటూ ప్రశ్నించారు.

ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నేరస్థులు, మాఫియాపై తమ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆపరేషన్‌ సరైనదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఆస్తులను ఇష్టారీతిగా ఆక్రమించుకున్నారని.. గత ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసించలేదని మండిపడ్డారు.

మీరు ఏమిట్లు అని అడగొద్దు.. కులాలపై ఆరా తీస్తే కఠిన చర్యలు

మైనారిటీ వర్గానికి చెందిన నేరస్థులనే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టారని వచ్చిన ఆరోపణలను ఆయన తోచిపుచ్చారు. ‘‘దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. అందరికీ న్యాయం చేసేందుకు కోర్టులు ఉన్నాయి. ఇంతవరకు ఒక మైనారిటీ వచ్చి తనకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేయలేదు. రాష్ట్ర ప్రజలందరికీ సమాన పరిపాలన, భద్రత అమలవుతోంది’’అని అన్నారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక ఎలాంటి అల్లర్లు జరగలేదని.. ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని వివరించారు. ఈ క్రమంలో తృణముల్‌ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఆ పార్టీ దేశాన్ని మరో పశ్చిమ బెంగాల్‌గా మార్చాలనుకుంటోందని విమర్శించారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో గ్రామీణ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని