Chiranjeevi: పూరీ జగన్నాథ్‌ కలను నిజం చేసిన చిరంజీవి

పూరీ జగన్నాథ్‌ ఏళ్ల నాటి కలను మెగాస్టార్‌ చిరంజీవి నిజం చేశారు.

Published : 09 Apr 2022 12:15 IST

స్టార్‌ డైరెక్టర్‌పై మెగా ట్వీట్‌

హైదరాబాద్‌: స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ఎన్నో ఏళ్ల కలను మెగాస్టార్‌ చిరంజీవి నిజం చేశారు. పూరీ కల కలగానే మిగిలిపోకూడదని అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇంతకీ పూరీ కలను చిరు ఎలా నిజం చేశారంటే.. పూరీకి చిన్నప్పటి నుంచి సినిమా పరిశ్రమపై ఎనలేని అభిమానం. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద నటుడు కావాలని ఎన్నో కలలు కన్నారు. కానీ, అనుకోని విధంగా దర్శకత్వంవైపు ఆయన అడుగులుపడిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో మాస్‌ హిట్స్‌ తెరకెక్కించారు.

పూరీ గురించి తెలుసుకున్న చిరంజీవి ఆయన కలను సాకారం చేయాలనుకున్నారు. తాను నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’లో ఓ స్పెషల్‌ రోల్‌కు పూరీని తీసుకుంటే బాగుంటుందని భావించారు. టీమ్‌ కూడా అందుకు ఓకే అనడంతో పూరీ జగన్నాథ్‌ ఈ సినిమాలో భాగమయ్యారు. అలా, ఆయన శనివారం ఉదయం ‘గాడ్‌ఫాదర్‌’ సెట్‌లోకి అడుగుపెట్టారు. లేటస్ట్‌ షెడ్యూల్‌లో ఆయనపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరు ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

‘‘వెండితెరపై నటుడిగా ఓ వెలుగు వెలగాలనే ఉద్దేశంతో నర్సీంపట్నం నుంచి ఓ కుర్రాడు హైదరాబాద్‌ వచ్చాడు. ఒకటి, అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ, అతడి మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే ఇలా’’ అని చిరు పేర్కొన్నారు. మలయాళీ  ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్‌’ రూపుదిద్దుకుంటోంది. మోహన్‌రాజా దర్శకుడు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈసినిమలో పూరీ జర్నలిస్ట్‌గా కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని