Tollywood: అతిథి కాదు.. అంతకు మించి

నేడు కథలు చెప్పే విధానం పూర్తిగా మారిపోయింది. ఏ తరహా కథ ఎంచుకున్నా.. దాన్ని ఓ భాషా పరిశ్రమకే పరిమితం చేయడం లేదు. ప్రాంతీయ, భాషా హద్దులు చెరిపేస్తూ అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Updated : 09 Oct 2022 07:36 IST

నేడు కథలు చెప్పే విధానం పూర్తిగా మారిపోయింది. ఏ తరహా కథ ఎంచుకున్నా.. దాన్ని ఓ భాషా పరిశ్రమకే పరిమితం చేయడం లేదు. ప్రాంతీయ, భాషా హద్దులు చెరిపేస్తూ అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నటుడిగా ఉండటాన్ని ఒక వరంలా భావిస్తోంది నాయకా లోకం. ఎందుకంటే స్టార్‌ హీరోగా ఓ ఇమేజ్‌ ఛట్రంలో ఇరుక్కొని ఒక భాషకే పరిమితమయ్యే కన్నా.. వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ.. నటుడిగా అందరికీ దగ్గరవడమే మేలని నమ్ముతున్నారు కథానాయకులు. ఫలితంగా తమ మార్కెట్‌ పరిధి విస్తృతమవ్వడమే కాక.. తమ ప్రతిభను అన్ని చిత్రసీమలకు పరిచయం చేసే అవకాశం దొరుకుతుంది. అందుకే ఇప్పుడీ పంథాని ఇటు అగ్ర హీరోలు.. అటు యువ హీరోలు బాగా అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు తెలుగులో హీరోగా మెప్పిస్తూనే.. పరభాషా చిత్రాల్లో నటుడిగా మెరిసేందుకు సిద్ధపడుతున్నారు. ఫలితంగా సినీప్రియులకు తెరపై అరుదైన కలయికలు చూసే అవకాశం దొరుకుతోంది.

తెలుగు హీరోలు పరభాషా చిత్రాల్లో నటుడిగా మెరిసింది చాలా తక్కువే. ఇక్కడ స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకుని మరో భాషలో సహ నటుడిగా చేస్తే ఇమేజ్‌ ఎక్కడ దెబ్బతింటుందోన్న భయాలు వెంటాడేవి. అందుకే తెలుగు హీరోల నుంచి ఈ తరహా ప్రయత్నాలు అరుదుగా కనిపించేవి. అయితే పాన్‌ ఇండియా సంస్కృతి ఈ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. వైవిధ్యభరితమైన పాత్రలు ఎదురైతే చాలు.. ఇమేజ్‌ను పక్కకు పెట్టి మరీ మరో హీరోతో కలిసి తెర పంచుకునేందుకు రంగంలోకి దిగిపోతున్నారు. ఇటీవల అగ్ర హీరో నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ కోసం ఈతరహా ప్రయత్నమే చేశారు. ఇక ఆయన తనయుడు నాగచైతన్య ‘లాల్‌ సింగ్‌ ఛడ్డా’లో కీలక పాత్ర పోషించి, మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్ర హీరో వెంకటేష్‌ చేతిలో కనిపిస్తున్న రెండు సినిమాలూ ఈ తరహా ప్రయత్నాలే. అందులో ఒకటి సల్మాన్‌ ఖాన్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌’. ఇందులో వెంకటేష్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో కథానాయకుడు రామ్‌చరణ్‌ ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవనుండటం మరో విశేషం. ఇక వెంకీ అతిథి పాత్రలో సందడి చేసిన మరో చిత్రం ‘ఓరి దేవుడా’. విష్వక్‌ సేన్‌ హీరోగా నటించిన చిత్రమిది.


యువ కథానాయకుల సందడి

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ధనుష్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమా.. ఇటీవలే పట్టాలెక్కింది. మరో యువ హీరో సత్యదేవ్‌ ఇటీవల చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ కోసం ప్రతినాయకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన హిందీలో అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘రామ్‌సేతు’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో అక్షయ్‌కు సహాయ పడే ఓ కీలక పాత్రలో సత్యదేవ్‌ కనిపించనున్నారు. కథానాయకుడు విష్వక్‌ సేన్‌ ఓ చిన్న సినిమాలో కీలక పాత్ర పోషించారు. అదే ‘ముఖచిత్రం’. ఈ చిత్రంలో.. విశ్వామిత్ర అనే న్యాయవాది పాత్రలో సందడి చేశారు విష్వక్‌ సేన్‌. ఓవైపు హీరోగా మెప్పిస్తూనే.. మంచి పాత్రలు దొరికినప్పుడల్లా సహాయ నటుడిగానూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు సుశాంత్‌. అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో రాజ్‌ మనోహర్‌గా కీలక పాత్రలో సందడి చేసిన ఆయన.. ఇప్పుడు ‘రావణాసుర’లో రామ్‌గా పలకరించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రమిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని