Paarijatha Parvam: ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు

‘‘స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ‘పారిజాతపర్వం’. దీంట్లో అపరిమితమైన వినోదం ఉంది. తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని బలంగా నమ్ముతున్నాం’’ అన్నారు హీరో చైతన్య రావు

Updated : 17 Apr 2024 12:00 IST

‘స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ‘పారిజాతపర్వం’. దీంట్లో అపరిమితమైన వినోదం ఉంది. తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని బలంగా నమ్ముతున్నాం’’ అన్నారు హీరో చైతన్య రావు. ఆయన.. సునీల్‌, శ్రద్ధా దాస్‌, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో సంతోష్‌ కంభంపాటి తెరకెక్కించిన చిత్రమే ‘పారిజాతపర్వం’. కిడ్నాప్‌ ఈజ్‌ ఎన్‌ ఆర్ట్‌.. అన్నది ఉపశీర్షిక. మహీధర్‌ రెడ్డి, దేవేష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ కిడ్నాప్‌ ఈవెంట్‌ పేరుతో ఓ వేడుక నిర్వహించారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. ‘‘ఇది చిన్న సినిమా కాదు. బలమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. దీనికి సీక్వెల్‌ కూడా ఉంది. ఈ చిత్రంతో చిత్ర పరిశ్రమకు ఇంకో మంచి దర్శకుడు రానున్నారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నటనకు ప్రాధాన్యమున్న పాత్ర పోషించా. నా పాత్రలో కొన్ని ఆశ్చర్యపరిచే అంశాలున్నాయి. నాకింత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు సంతోష్‌కు కృతజ్ఞతలు’’ అంది నటి శ్రద్ధా దాస్‌. దర్శకుడు సంతోష్‌ కంభంపాటి మాట్లాడుతూ.. ‘‘ఇదొక భిన్నమైన కన్ఫ్యూజ్‌ కిడ్నాప్‌ డ్రామా. రెండు గంటల నిడివి ఉన్న చిత్రమిది. దీంట్లో తొలి 25నిమిషాలు పాత్రల్ని పరిచయం చేస్తా. ఇక ఆ తర్వాత నుంచి ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవేష్‌, మహీధర్‌, వైవా హర్ష, రాంబాబు గోసాల తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని