సంక్షిప్త వార్తలు(2)

హిందీ చిత్రసీమలో విజయాల సందడి బాగా తగ్గిపోయింది. కరోనా తర్వాత పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చినా జనం థియేటర్లకు రావడం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.

Updated : 17 Nov 2022 03:49 IST

యువ హీరోల ఓటీటీ బాట

హిందీ చిత్రసీమలో విజయాల సందడి బాగా తగ్గిపోయింది. కరోనా తర్వాత పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చినా జనం థియేటర్లకు రావడం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. దీంతో కొన్ని సినిమాలు ఇప్పటికీ ఓటీటీ వైపే మొగ్గుచూపుతున్నాయి. తాజాగా ఇద్దరి యువ కథానాయకుల చిత్రాలు ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు ప్రకటించాయి ఆయా చిత్రబృందాలు.


‘మిషన్‌..’ జనవరిలో..: యువ కథా  నాయకుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మిషన్‌ మజ్ను’. శంతను బగ్చీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రోనీ స్క్రూవాలా, గరిమ మెహతా, అమర్‌ బుటాలా నిర్మించారు. ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా జనవరిలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుంది. పాకిస్థాన్‌లో మన దేశం జరిపే కోవర్ట్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది.


గోవిందుడుది అదే దారి: విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గోవింద్‌ నామ్‌ మేరా’. భూమి పెడ్నేకర్‌, కియారా అడ్వాణీ నాయికలు. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని విక్కీ, కరణ్‌లు ఓ ఫన్నీ వీడియో ద్వారా తెలియజేశారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించారు. విక్కీ ప్రస్తుతం మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తోన్న సామ్‌ మానెక్షా బయోపిక్‌ ‘సామ్‌ బహదూర్‌’లో నటిస్తున్నాడు. ఆ తర్వాత లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో సారా అలీఖాన్‌ హీరోయిన్‌గా ఓ సినిమా చేయనున్నాడు.


సాహసవీరుడి కథలో

పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఓ బొగ్గు గని ప్రమాదం నుంచి 64 మంది ప్రాణాల్ని కాపాడి గొప్ప మనిషిగా నిలిచారు జస్వంత్‌ సింగ్‌ గ్రిల్‌. ఇప్పుడు ఆయన కథ తెరపైకి వస్తోంది. ప్రముఖ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ తెరపై సింగ్‌గా కనిపించనున్నారు. తాజాగా అక్షయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. పూజా ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ నిర్మించనున్న ఈ చిత్రాన్ని ‘రుస్తుం’ దర్శకుడు టిను సురేష్‌ దేశాయ్‌ తెరకెక్కించనున్నారు. తన సాహసానికి గుర్తుగా ఎన్నో పురస్కారాలు అందుకున్న గిల్‌ 2019లో మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని