Payal Rajput: కెరీర్‌ విషయంలో గందరగోళంలో పడ్డా.. ఇది నా కమ్‌బ్యాక్‌: పాయల్‌ రాజ్‌పుత్‌

‘మంగళవారం’ (Mangalavaram) ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తన కమ్‌బ్యాక్‌ అన్నారు.

Updated : 21 Oct 2023 17:19 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ (RX 100)తో నటి పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput)ను వెండితెరకు పరిచయం చేశారు దర్శకుడు అజయ్‌ భూపతి (Ajay Bhupathi). వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మంగళవారం’ (Mangalavaram). సస్పెన్స్‌, క్రైమ్‌ కథా చిత్రంగా దీనిని తీర్చిదిద్దారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న అజయ్‌భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌, నందితా శ్వేత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా.  కాస్త కంగారుగానూ ఉంది. నేడు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. ‘మంగళవారం’ ట్రైలర్‌ విడుదలైంది. మా చిత్రానికి వస్తోన్న బజ్‌ చూసి ఆనందంతో మాటలు రావడం లేదు. నిజం చెప్పాలంటే, కొంతకాలం క్రితం వరకూ కెరీర్‌ విషయంలో గందరగోళంలో ఉన్నా. ఎవరితో మాట్లాడాలో, ఎవరి సాయం తీసుకోవాలో అర్థం కాలేదు. కానీ, నేను ఆశలు వదులుకోలేదు. కట్‌ చేస్తే.. ‘మంగళవారం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ఈ చిత్రాన్ని ఒక వరంలా భావిస్తున్నా. 2018లో ‘ఆర్‌ఎక్స్‌ 100’తో అజయ్‌ భూపతి నన్ను వెండితెరకు పరిచయం చేశారు. ఆ చిత్రం నా కెరీర్‌నే మార్చేసింది. గడిచిన ఏడాది నుంచి ‘మంగళవారం’ కోసమే వర్క్‌ చేస్తున్నా. తెలుగు చిత్ర పరిశ్రమలోకి కమ్‌బ్యాక్‌ అవుతున్నట్లు ఉంది’’ అని పాయల్‌ అన్నారు.

LEO: ‘లియో’.. రూ.1000 కోట్లు మేము ఆశించడం లేదు: చిత్ర నిర్మాత లలిత్‌కుమార్‌

ఇది ఏ జానర్‌ సినిమా? అసలు కథేంటి?

అజయ్ భూపతి: కథ ఏమిటనేది ఇప్పుడే చెప్పలేను. ఇదొక డార్క్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. అన్ని రకాల భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. ట్రైలర్‌లో చూపించలేదు. ఈ చిత్రంతో ఓ సరికొత్త జానర్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తా. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాన్ని అందరూ రొమాంటిక్‌ అన్నారు కానీ.. సినిమా రిలీజ్‌ అయ్యాక ఎంతోమంది ఆడవాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటూ థియేటర్‌ నుంచి బయటకు వచ్చారు. ఈ చిత్రానికీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుందని నమ్ముతున్నా.

‘ఆర్‌ఎక్స్‌ 100’ సక్సెస్‌ మీకు ఎప్పుడైనా భారంగా అనిపించిందా?

అజయ్ భూపతి: దర్శకుడిని కావాలనే ఉద్దేశంతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టా. హిట్‌ లేదా ఫ్లాప్‌ అనేది నాకు సంబంధం లేదు. ‘మహా సముద్రం’ సూపర్‌ డూపర్‌ బ్లాక్‌బస్టర్‌ అయినా ‘మంగళవారం’ చిత్రాన్ని తీసేవాడిని. ఆ సినిమా సక్సెస్‌ భారంగా మారిందా? మళ్లీ అంత సక్సెస్‌ కొట్టగలమా? లేదా? అనేది ఆలోచించలేదు. విభిన్న చిత్రాలు తీస్తూ ముందుకు వెళ్తా. అదే నాకు తెలుసు.

‘మహా సముద్రం’ విషయంలో మీ జడ్జిమెంట్ తప్పిందంటారా?

అజయ్ భూపతి: సినిమా ఏదైనా సరే మంచి ఫలితం వస్తుందన్న నమ్మకంతో తీస్తాం. రేపు రిలీజ్‌ అనగా.. ఈ రోజు తాము తెరకెక్కించిన సినిమా చూసి అది హిట్టు అవుతుందా? ఫ్లాప్‌ అవుతుందా అనేది ఎవరూ ఊహించలేరు. ప్రేక్షకుల్లోకి వెళ్లాకే దాని ఫలితం తెలుస్తుంది.

ఈ సినిమా మీకు తిరిగి సక్సెస్‌ ఇస్తుందని నమ్ముతున్నారా?

పాయల్‌ రాజ్‌పుత్‌: ఇదొక అద్భుతమైన కథతో తెరకెక్కిన సినిమా. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని నాకు విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నా.

సాధారణంగా సక్సెస్‌ అయిన సినిమా పేరుని మాత్రమే కొత్త సినిమా పోస్టర్‌పై వేస్తారు కదా. మీరేంటి ఫ్రమ్‌ ది మేకర్స్‌ ఆఫ్‌ ‘ఆర్‌ ఎక్స్‌ 100’ ‘మహాసముద్రం’ అని వేశారు?   

అజయ్‌ భూపతి: ‘మహా సముద్రం’ కూడా నేను చేసిన సినిమానే కదా. నేను డైరెక్ట్‌ చేసే ప్రతి చిత్రాన్ని నా కొత్త సినిమా పోస్టర్‌పై వేస్తా.

‘ఆర్‌ఎక్స్‌ 100’ను వదులుకోవడానికి కారణం ఏమిటి? అలాగే మంగళవారంలో పోలీస్‌ పాత్ర చేయడానికి కారణం?

నందితా శ్వేత: పాయల్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని. ఎందుకంటే అప్పటికే నేను ఇండస్ట్రీలోకి వచ్చేశా. (నవ్వులు) ఇక, ‘మంగళవారం’లో నా రోల్‌ ఎంతో కీలకంగా ఉండనుంది. ఈ పాత్ర నాకెంతో నచ్చింది అందుకే ఓకే చేశా.

ఈ సినిమా ఓకే చేయడానికి ప్రధాన కారణం ఏమిటి?

పాయల్‌ రాజ్‌పుత్‌: అజయ్‌ నన్ను అప్రోచ్‌ అయ్యే సమయానికి నా పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నా. సర్జరీకి వెళ్లాల్సిందేనని వైద్యులు సూచించారు. అజయ్‌ చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో.. ‘‘సినిమా పూర్తయ్యాకే సర్జరీకి వెళ్తా’’ అని చెప్పా.

‘మంగళవారం’ టైటిల్‌ కథేమిటి? కార్తికేయతో సినిమా ఎప్పుడు?

అజయ్‌ భూపతి: కథకు సరిపడుతుందనే భావనతోనే ‘మంగళవారం’ అని పెట్టా. కార్తికేయతో త్వరలోనే ఓ సినిమా చేయాలనుకుంటున్నా. చర్చలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని