Tollywood: నవ్వులు పంచే ‘జిలేబి’

‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ వంటి వినోదాత్మక చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు దర్శకుడు కె.విజయభాస్కర్‌. ఆయన తన తనయుడు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘జిలేబి’.

Updated : 07 Apr 2023 07:20 IST

‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ వంటి వినోదాత్మక చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు దర్శకుడు కె.విజయభాస్కర్‌. ఆయన తన తనయుడు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘జిలేబి’. గుంటూరు రామకృష్ణ నిర్మాత. శివానీ రాజశేఖర్‌ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర గ్లింప్స్‌ను హీరో వెంకటేష్‌ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమా కూడా జిలేబి అంత స్వీట్‌గా ఉంటుందని అనిపిస్తోంది. ఎందుకంటే ఇది నాకెంతో ఇష్టమైన దర్శకుడు విజయభాస్కర్‌ నుంచి వస్తోంది. తనతో ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు చేశా. ఇది కూడా వాటిలాగే మంచి వినోదంతో నిండిన సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నా నమ్మకం. ఈ సినిమాతో కమల్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. తను.. శివానీ ఇందులో అద్భుతమైన పాత్రలు పోషించారు’’ అన్నారు. ‘‘కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. అందరూ ఎంజాయ్‌ చేస్తారని నమ్ముతున్నా’’ అన్నారు హీరో కమల్‌. దర్శకుడు విజయభాస్కర్‌ మాట్లాడుతూ.. ‘‘ఎంతో సరదాగా చేసిన చిత్రమిది. అందరం ఓ కుటుంబంలా కలిసి కష్టపడి చేశాం. దీని గురించి ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడను. ప్రేక్షకులు చూసి.. చెబితే, విని సంతోష పడతాను. మణిశర్మ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమిది. ఇందులో రాజేంద్రప్రసాద్‌ ఓ కీలక పాత్రలో నటించారు. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అంది నటి శివానీ. ఈ కార్యక్రమంలో సతీష్‌ ముత్యాల, బబ్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని