California: ఉత్తర కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు లక్షలాది ఎకరాల్లో అటవీ సంపదను దహించివేస్తోంది.

Published : 12 Jul 2021 12:49 IST

లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద దగ్ధం
108 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రం

కాలిఫోర్నియా: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు లక్షలాది ఎకరాల్లో అటవీ సంపదను దహించివేస్తోంది. భీకరమైన వేడుగాలులకు డెత్‌వాలీ జాతీయ పార్క్‌ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు 54 డిగ్రీ సెల్సియస్‌కు చేరినట్లు అధికారులు తెలిపారు. 1913 తర్వాత తొలిసారి భారీ స్థాయిలో కార్చిచ్చు చెలరేగడం వల్ల బ్యాక్‌వర్త్‌ కాంప్లెక్స్‌ రిజియన్‌లోని అటవీ ప్రాంతంలో దాదాపు 72 కిలోమీటర్ల పరిధిలో వృక్ష సంపద ఆహుతైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఓరెగాన్‌లో 311 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం కాలిబూడిదైనట్లు తెలిపిన అధికారులు.. వాషింగ్టన్‌కు ఆగ్నేయ దిశలో 155 చదరపు కిలోమీటర్ల పరిధిలో వృక్ష సంపద కాలిపోయినట్లు వివరించారు. నెవడా అటవీప్రాంతంలో పెద్దఎత్తున మంటలు వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాలిఫోర్నియాలోని ఉత్తర పర్వత ప్రాంతాల్లోని నివాస గృహాలు కార్చిచ్చు మంటలు, వేడిగాలులకు పెద్దఎత్తున ప్రభావితమైనట్లు వివరించారు. కార్చిచ్చుకు తోడు పెద్దఎత్తున వేడి గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ముందుజాగ్రత్త చర్యగా అటవీ ప్రాంతానికి 518 చదరపు మైళ్ల పరిధిలోని ప్రజలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కాలిఫోర్నియాలో వేలాది మంది ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కొన్ని ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాలిఫోర్నియా ఈశాన్య ప్రాంతంలో 100 అడుగుల ఎత్తుకు మంటలు ఎగసిపడుతున్నట్లు అటవీ అధికారి కాక్స్‌ తెలిపారు. వన్యజీవులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నట్లు చెప్పారు. వాటిని సంరక్షించేందుకు 
అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

12 వందల మంది సిబ్బంది..

కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు అమెరికా అగ్నిమాపక దళం తీవ్రంగా కృషి చేస్తోంది. దాదాపు 12 వంద ల మంది సిబ్బంది.. మంటలను నియంత్రిస్తున్నారు. వేడిగాలులను తట్టుకుంటూనే వేలాది అగ్నిమాపక యంత్రాలు మంటలతో పోరాడుతున్నాయి. కొన్ని చోట్ల విమానాల సాయంతో మంటలపై నీటిని కురిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని