Assam: ​​​అటేం కూర్చుంటారు.. మా పార్టీలోకి రండి!

ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చునే బదులు అధికార పార్టీలో చేరండంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వాస్‌ శర్మ ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఆహ్వానించారు. ప్రజల కోసం.......

Published : 20 Jun 2021 01:34 IST

గువాహటి: ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చునే బదులు అధికార పార్టీలో చేరండంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వ శర్మ ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఆహ్వానించారు. ప్రజల కోసం కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రూప్‌జ్యోతి కుర్మీ ఆ పార్టీకి రాజీనామా చేసి సోమవారం భాజపాలో చేరనున్నారు. ఆయన చేరికపై మాట్లాడుతూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఐదేళ్ల పాటు ప్రతిపక్షం వైపు కూర్చుని ఏం చేస్తారు? దాని బదులు మాతో కలవండి. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రతిపక్ష సభ్యులు మాతో కలిసి రండి. కలిసి పనిచేద్దాం’’ అని హిమంత అన్నారు. మరోవైపు పార్టీని వీడుతున్న సందర్భంగా రూప్‌జ్యోతి కుర్మీ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. క్షేత్రస్థాయి నేతలను అసలు పట్టించుకోవడం లేదన్నారు. అందుకే అసోం సహా ఐదు చోట్లా పార్టీ ఓటమి పాలైందన్నారు.

అసోంను 2001 నుంచి మూడుసార్లు వరుసగా ఏలిన కాంగ్రెస్‌ పార్టీ 2016 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఘోర పరాజయం చవిచూసింది. ప్రస్తుతం 126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 28. భాజపాకు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని