భగ్గుమంటున్న మగ్గం

రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక..

Updated : 09 May 2024 08:35 IST

షరతులతో నేతన్న నేస్తానికి కోత
కూలి కార్మికుల పొట్టకొట్టిన జగన్‌
మార్కెటింగ్‌ సహకారానికి తిలోదకాలు
తెదేపా ప్రభుత్వం అమలు చేసిన  రాయితీకి ఎగనామం
ముడి సరకు ధరలు  రెట్టింపైనా...  జీఎస్టీ గుదిబండగా మారినా ఆదుకోని వైకాపా సర్కారు

రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక.. పథకాలను అందని ద్రాక్షల్ని చేసినందుకు... మీకు నీతి లేదని చే‘నేత’లు... చీదరించుకుంటున్నారు జగన్‌!

‘మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు ప్రోత్సాహకంగా ఇస్తాం’... 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో చేనేతలకు జగన్‌ ఇచ్చిన హామీ ఇది. తీరా అధికారంలోకి వచ్చాక హామీకి ముందు ‘సొంత’ అనే పదాన్ని చేర్చి ‘సొంత మగ్గముంటేనే రూ.24 వేలు ఇస్తా’మని మాట మార్చారు. కూలీ మగ్గాలపై నేసే వారందరి నోట్లో మట్టి కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, అనుబంధ రంగాల్లో 3.50 లక్షల మంది కార్మికులుంటే నేతన్న నేస్తం కింద జగన్‌ ఆర్థికసాయం అందించింది 80 వేల మందికే. ఈ ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నానని చెప్పి.. తెదేపా ప్రభుత్వంలో చేనేతలకు అమలైన ఇతర పథకాలన్నీ రద్దు చేశారు. ముడి సరకు రాయితీ ఎత్తేశారు. మార్కెటింగ్‌కు  సహకారం ఇవ్వలేదు. నిల్వలు పేరుకుపోయినా పట్టించుకోలేదు. గుంత మగ్గాల్లో నీరు చేరి అల్లాడినా చెవికి ఎక్కించుకోలేదు. జీఎస్టీ గుదిబండగా మారినా మిన్నకున్నారు. వీటన్నింటికీ తోడు మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర రోజువారీ కూలీకి వెళ్లే వారికి నేతన్ననేస్తం ఎగ్గొట్టారు. చేనేతలకు 45 ఏళ్లకు పింఛను ఇస్తాననే హామీకి నీళ్లొదిలారు. 90% రాయితీతో కేంద్రం ఇచ్చే ఆధునిక  పరికరాలను అందించలేదు. ఇన్నీ దుర్మార్గాలు చేసింది జగనే. బీసీలంటే ఎంత పగ లేకుంటే ఇన్ని దారుణాలకు ఒడిగడతారు?

కూలీ మగ్గాలపై ఎవరు నేస్తున్నారో గుర్తించడం కష్టమట!

చేనేతలందరికీ నేతన్ననేస్తం వర్తింపచేయకుండా జగన్‌ కుట్ర పన్నారు. లేకపోతే 100 మగ్గాలున్న మాస్టర్‌ వీవర్‌కు ఆర్థిక సాయం అందిస్తూ... వాటిపై కూలీలుగా పనిచేసే కార్మికులకు వర్తింప చేయకపోవడం ఏమిటి? ప్రజల సమస్త సమాచారాన్ని చటుక్కున తెలుసుకునే వాలంటీరు, గ్రామ సచివాలయ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి కదా! అలాంటప్పుడు మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర పనిచేస్తున్న కూలీల వివరాలను తెలుసుకోవడం కష్టమా? నేత పనుల్లో అల్లు పోయడం, రంగులు అద్దడం, వార్పింగ్‌, జరీపోయడం, వైండింగ్‌, అచ్చు అతకడం, కండెలు చుట్టడం, డిజైనింగ్‌ పనులను అనుబంధ రంగాల వారు చేస్తారు. నిజంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలనే తపనే జగన్‌కు ఉంటే ఎందరు ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారో లెక్క తేల్చలేరా?

  • కంచిపట్టు చీరల నేతకు ధర్మవరం ప్రసిద్ధి. ఇక్కడ 33 వేల మంది చేనేత వృత్తిలో ఉండగా... నేతన్ననేస్తం సాయం 10 వేల మందికే అందింది. మిగతా వారిలో 15 వేల మంది కూలీలు మగ్గాలు నేస్తున్నారని, 8 వేల మంది చేనేత ఉపవృత్తులు చేసుకుంటున్నారని సాయం అందించరట. రోజుకు రూ.400 సంపాదించే వీరంతా జగన్‌ దృష్టిలో ధనవంతులుగా కనిపించడమే ఇక్కడ విషాదం.  ఇది ఒక్క ధర్మవరానికే పరిమితం కాదు. రాష్ట్రంలోని చేనేత కార్మికులున్న ప్రతిచోటా ఇలాంటి పరిస్థితే ఉంది.
  • మంగళగిరి కార్పొరేషన్‌లో 2,500 మంది చేనేత కార్మికులున్నారు. వీరిలో సొంత మగ్గాలున్న 488 మందికి 5వ విడతలో నేతన్ననేస్తం అందించారు. మాస్టర్‌ వీవర్స్‌ వద్ద, సొసైటీల్లో నేసే 700 మందికి, ఇళ్లల్లో అద్దె మగ్గాలపై నేసే మిగతా వారికి పథకం వర్తించలేదు.
  • ఎమ్మిగనూరులో గద్వాల పట్టు చీరలు నేసే కార్మికులు 8,200 మంది ఉంటే నేతన్ననేస్తం సాయం అందించింది 1,800 మందికే. మిగతా 6,400 మంది మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర కూలీ కింద మగ్గాలు నేసేవారే.
  • మదనపల్లె పురపాలక సంఘంలో 2,904 మందికి నేతన్ననేస్తం కింద ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక్కడ అద్దె మగ్గాలపై నేసే 1,500 మందికి, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న 3 వేల మందికి మొండిచేయి చూపించారు.

గుంత మగ్గాల్లోకి నీరు చేరినా...

నాలుగు చినుకులు రాలినా... జోరున వర్షం కురిసినా.... వాతావరణంలో తేమ శాతం పెరిగినా... మగ్గంపై పడుగు, పేక ముందుకు కదలదు.   తుపాన్లు పోటెత్తితే కార్మికుల ఉపాధిపై పడే ప్రభావం మరింత ఎక్కువే. గుంత మగ్గాలున్న వారి పరిస్థితి మరీ దారుణం. మగ్గంపై ఉన్న చీరలు పాడైపోతాయి. మగ్గాలు, రాట్నాలు దెబ్బతింటాయి. వర్షం ఆగినా నీటి ఊట ఆగదు. మగ్గం ఆడేందుకు సహకరించదు. ఇలా ఒకటి, రెండు రోజులైతే ఫర్వాలేదు. అదే 20-30 రోజులు అయితే? వర్షాకాలం మొత్తం ఇదే పరిస్థితి ఎదురైతే? ఆ పేద చేనేత కుటుంబాలు కడుపు నింపుకొనేది ఎలా? జగన్‌ ఇవేమీ ఆలోచించలేదు.

  • గతేడాది తుపాన్ల సమయంలో వెంకటగిరిలో 800 గుంత మగ్గాల్లో నీరు చేరడంతో కార్మికుల ఉపాధి తీవ్రంగా దెబ్బతింది. మగ్గంపై ఉన్న రూ.20-40 వేల విలువైన చీరలు పాడయ్యాయి. ఒక్కో నేత కార్మికుడికి రూ.15-30 వేల వరకు నష్టం వాటిల్లింది.
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 5వేల వరకు గుంతమగ్గాలున్నాయి. 2022లో కురిసిన భారీ వర్షాలకు గుంతల్లో ఊట నీరు చేరి చీరలు, మగ్గాలు దెబ్బతిన్నాయి.
  • అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో 6వేల మగ్గాలున్నాయి. గతేడాది నవంబరు, డిసెంబరులో కురిసిన వర్షంతో నేతన్నలు 25 రోజులపాటు ఉపాధికి దూరమయ్యారు. జగన్‌ ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదు.

చేనేత సంఘాల్ని నిర్వీర్యం చేశారు...

రాష్ట్రంలో 800 పైగా చేనేత సంఘాలున్నాయి. ఇందులో ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా గత ప్రభుత్వాలు మార్కెటింగ్‌ ఇన్సెంటివ్‌ పథకాన్ని అమలు చేశాయి. మూడేళ్ల సరాసరి అమ్మకాలను తీసుకుని దానిపై 10% రాయితీ ఇచ్చేవారు. ఒక్కో సంఘానికి రూ.8 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు లబ్ధి చేకూరేది. జగన్‌ వచ్చాక దీన్ని పూర్తిగా నిలిపేశారు.

త్రిఫ్ట్‌ ఫండ్‌ను తీసేశారు...

సంఘాల్లోని కార్మికుల్లో పొదుపును ప్రోత్సాహించేందుకు అప్పట్లో త్రిఫ్ట్‌ పథకం అమలైంది. నేత కార్మికుడు నెలవారీ ఆదాయంలో 8% పొదుపు చేసుకుంటే దానికి సమానంగా 8% ప్రభుత్వం చెల్లిస్తుంది. మొదట్లో ఈ 8%లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4% చొప్పున భరించేవి. కేంద్రం ఈ పథకాన్ని తీసేసినా... అప్పటి తెదేపా ప్రభుత్వం తానే మొత్తం 8% భరిస్తానని హామీ ఇచ్చింది. జగన్‌ దీన్ని అమలు చేయలేదు.

జీఎస్టీ గుదిబండగా మారినా ఆదుకోలేదు..

చేనేతలపై జీఎస్టీ భారం గుదిబండగా మారింది. నూలుపై 5%, రంగుపై 18%, రసాయనాలపై 18% జీఎస్టీ ఉంది. కరోనాకు ముందు ముడిసరకు రూ.3,200 వరకు ఉండగా ప్రస్తుతం రూ.5,500కు చేరింది. నిన్నమొన్నటి దాకా రూ.6,000 వరకు ఉంది. అంటే ఐదేళ్లలో దాదాపు రెట్టింపు అయినా... పట్టించుకోలేదు.

తెదేపా ప్రభుత్వమిచ్చిన పట్టు రాయితీని ఎత్తేశారు...

పట్టుచీరలు నేసే కార్మికులకు ముడిసరకు రాయితీ పథకమనేది అత్యంత కీలకమైనది. దీన్ని నిలిపేసి వారిపై జగన్‌ కోలుకోలేని దెబ్బకొట్టారు. తెదేపా ప్రభుత్వం మొదట్లో ఒక్కో చేనేత కార్మికుడికి నెలకు ఆరు కిలోలకు కిలోపై రూ.200 చొప్పున రూ.1,200 రాయితీగా అందించింది. అంటే ఏడాదికి రూ.14,400. ఆ తర్వాత ముడి సరకు ధరలు పెరగడంతో 2018-19లో నెలకు ఇచ్చే రాయితీని రూ.2 వేలకు పెంచింది. అంటే నేత కార్మికునికి ఏడాదికి రూ.24 వేలు రాయితీగా అందినట్టే. దీన్ని మరింత గొప్పగా అమలు చేస్తానని ప్రతిపక్షనేతగా హామీ ఇచ్చిన జగన్‌ గెలిచాక మడమ తిప్పేశారు.

చేనేత పింఛన్లకు ఎసరు...

వృత్తి ఆధారంగా ఎప్పటి నుంచో చేనేతలు పింఛన్లు తీసుకుంటున్నారు. కొత్తగా పింఛను మంజూరు చేసేందుకు జగన్‌ ఎక్కడ లేని నిబంధనలు పెట్టారు. మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర పనిచేస్తున్న కార్మికులు.. ఆయన దగ్గర తీసుకునే కూలి డబ్బు రెండేళ్ల నుంచి కార్మికుని బ్యాంకు ఖాతాలో జమైనట్టు ఆధారం చూపించాలట. ఈమేరకు మాస్టర్‌ వీవర్‌ సైతం ధ్రువీకరణ అందించాలట. సొంత మగ్గం నేసే వారైతే ముడిసరకు కొనుగోలుకు సంబంధించి రెండేళ్ల జీఎస్టీ చెల్లింపు వివరాలు అందించాలట. ఈ నిబంధనల్ని పెట్టి జనవరికి ముందు కొత్తగా దరఖాస్తు చేసుకున్న చేనేతలెవ్వరికీ పింఛను ఇవ్వలేదు. ప్రస్తుతానికి కొత్త పింఛన్ల వరకే ఈ నిబంధనల్ని పరిమితం చేశారు. మళ్లీ వైకాపానే అధికారంలోకి వస్తే పింఛన్ల పరిస్థితి ఏమవుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని