Chandrababu: కుప్పంలో లక్ష మెజార్టీయే మన టార్గెట్‌: చంద్రబాబు

దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు.

Updated : 25 Mar 2024 15:49 IST

కుప్పం: దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. తెదేపా కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా?అని ప్రశ్నించారు. తెదేపా హయాంలో అక్రమార్కులు రావడానికే భయపడ్డారని చెప్పారు. చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.  

‘‘దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ తెదేపా. వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చాం. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా.. మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తా. జగన్‌ మాదిరిగా రూ.10 ఇచ్చి.. రూ.100 లాగడం కాదు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతాం. అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం’’ అని చెప్పారు. కుప్పంలో లక్ష మెజార్టీ సాధించేందుకు తెదేపా కార్యకర్తలు కృషి చేయాలని.. అదే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 75 శాతం ఓట్లు పడేలా పనిచేయాలని చెప్పారు. వైకాపాకు ఓటు వేయాలని అడిగిన వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని