Nalgonda: కుర్చీలో కేసీఆర్‌ ఫొటో పెట్టి.. కాంగ్రెస్‌ నేతల వినూత్న నిరసన

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు.

Updated : 13 Feb 2024 16:50 IST

నల్గొండ (జిల్లా పరిషత్‌): భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో నేడు భారాస సభ నేపథ్యంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద అధికార పార్టీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. కేసీఆర్‌ చిత్రపటాన్ని కుర్చీలో పెట్టి ఆందోళన చేపట్టారు. 2014, 2019 ఎన్నికల ప్రచారానికి వచ్చిన భారాస అధినేత.. ‘నల్గొండ జిల్లాలోని తాగు, సాగునీటి ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చొని మరీ పూర్తి చేస్తా’మన్నారంటూ సంబంధిత వీడియోను ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఏపీ అసెంబ్లీలో కేసీఆర్‌ను సీఎం జగన్‌ పొగిడిన వీడియోనూ ప్రసారం చేశారు.  

డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. 90 శాతం పూర్తయిన వాటిని కూడా పట్టించుకోకపోవడంతో సాగు, తాగునీటి ఎద్దడి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఆయన అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు