Eatala Rajender: సింగరేణిపై చర్చకు సిద్ధమా? భారాసకు ఈటల సవాల్‌

సింగరేణిని ప్రైవేటు పరం చేస్తారంటూ భారాస చేస్తున్న ఆరోపణలపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలిపారు. తేదీ, సమయం చెబితే చర్చకు వస్తానని ఆయన భారాసకు సవాల్ విసిరారు.

Updated : 21 Apr 2023 14:36 IST

హైదరాబాద్: కేంద్రంపై భారాస పదే పదే విషం చిమ్ముతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Eatala Rajender) ఆరోపించారు. సింగరేణి (Singareni) సంస్థను ప్రైవేటు పరం చేసే ఆలోచన తమకు లేదని రామగుండం గడ్డ మీద నుంచి ప్రధాని మోదీ (PM Modi) స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సింగరేణి విధి విధానాలపై కేంద్రం జోక్యం చేసుకోవట్లేదని.. రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిందని చెప్పారు. సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారని భారాస చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు. తేదీ, సమయం చెబితే చర్చకు వస్తానని భారాస (BRS)కు ఆయన సవాల్‌ విసిరారు.

‘‘బొగ్గు గనులకు దరఖాస్తు చేసుకోకుండా కేంద్రంపై భారాస తప్పుడు ఆరోపణలు చేస్తోంది. సింగరేణిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. సింగరేణిలో మూడు గనులు ప్రైవేట్‌కి ఇచ్చి తవ్విస్తున్నది నిజం కాదా? ₹20కోట్ల బకాయిలు సింగరేణికి ఎందుకివ్వడం లేదు? విశాఖ గురించి ఆలోచిస్తున్న కేసీఆర్‌.. ముందు రాష్ట్రానికి న్యాయం చేయాలి. ఆర్టీసీ, నిజాం షుగర్‌, అజాంజాహి మిల్లు తెలంగాణవి కాదా? కేసీఆర్ సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కి కేసీఆర్‌ ₹25కోట్లు ఇచ్చారు. కాంగ్రెస్‌, భారాస ఒకే నాణేనికి ఉన్న బొమ్మ, బొరుసు. ఎన్నికల ముందో, తరువాతో కాంగ్రెస్‌, భారాస కలుస్తాయి’’ అని ఈటల వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని