Eatela Rajender: కమలం.. మార్పు మంత్రం

శాసనసభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్న భాజపా దీనికి తగ్గట్లుగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Updated : 10 Jun 2023 09:41 IST

ఈటలకు ప్రచార సారథి బాధ్యతలు?
అమిత్‌షా పర్యటనలోపే నిర్ణయం
ఎన్నికల ముందు కీలక పరిణామాలు

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్న భాజపా దీనికి తగ్గట్లుగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేతలంతా కలసికట్టుగా పనిచేసేలా చూడటం, ముఖ్యులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎన్నికలకు సిద్ధం కావడం, పార్టీ కార్యక్రమాలకు ఊపు తేవడం దీని ప్రధానోద్దేశంగా తెలుస్తోంది. చేరికల కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించడంతోపాటు మరికొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కిషన్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. దీన్ని భాజపా వర్గాలు తోసిపుచ్చుతున్నా.. ఈ నెల 15న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చేలోగానే కొన్ని కీలకమార్పులు చేయవచ్చని సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్థానం మాత్రమే గెల్చుకొన్న భాజపా అత్యధిక నియోజకవర్గాల్లో నామమాత్రంగానే ఓట్లు సాధించింది. కానీ వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాలను గెల్చుకుంది. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్‌లలో గెలవడం, మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడం, ఈ స్థానాల్లో కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితం కావడం వంటి పలు కారణాలతో అధికార భారాసకు భాజపాయే ప్రత్యామ్నాయమనే అభిప్రాయం నెలకొంది. 2018లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానంలో గెలిచారు. తర్వాత ఎంపీగా గెలవడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఇక్కడ వచ్చిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓడి భారాస గెలిచింది. తర్వాత వచ్చిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. ఈ రెండు స్థానాలు ఆ పార్టీ ముఖ్య నాయకులు ప్రాతినిధ్యం వహించినవే. ఇలా పలు కారణాలతో అధికార భారాసకు భాజపాయే గట్టిపోటీదారనే అభిప్రాయం నెలకొంది.

అగ్ర నాయకుల ఫోకస్‌

భాజపా రాష్ట్ర అధ్యకుడిగా బండి సంజయ్‌.. హిందుత్వ ప్రధాన ఎజెండాగా జనంలోకి వెళ్లారు.  దీంతోపాటు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా అధ్యక్షునిగా నియమించడం, రాజ్యసభకు పంపడంతోపాటు పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా భాజపా అధిష్ఠానం నియమించింది. ఇలా తెలంగాణకు అధిక ప్రాధాన్యమిస్తూ.. ప్రధాని మోదీ, అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పలుసార్లు రాష్ట్రంలో పర్యటించి భారాస ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రులు కూడా తరచూ పర్యటిస్తున్నారు. కొందరు లోక్‌సభ నియోజకవర్గాలవారీగా బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా మంత్రులందరూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపైన, భాజపాపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశంలో భాజపాను గట్టిగా వ్యతిరేకిస్తున్నది కేసీఆరే అన్న అభిప్రాయం నెలకొంది. భారాస నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్‌, బూర నరసయ్యగౌడ్‌, కాంగ్రెస్‌ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇలా పలువురు భాజపాలోనే చేరారు. భారాసను దీటుగా ఎదుర్కొనేది భాజపా అని ఆ నాయకులు భావించడమే దీనికి కారణం.

కర్ణాటక ఓటమి ప్రభావం..

భాజపాలో ఈటల రాజేందర్‌కు చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించినా.. కీలక పదవి ఏదీ లభించకపోవడం, పార్టీలో నాయకుల మధ్య సఖ్యత అంతగా లేకపోవడం తదితర అంశాలు నాయకుల అంతర్గత చర్చల్లో తరచూ వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో మరింత మార్పు వచ్చింది. రాష్ట్రంలో భారాసకు కాంగ్రెస్‌ పార్టీనే పోటీదారనే అభిప్రాయం నెలకొనగా, భాజపా నాయకుల్లో కూడా ఉత్సాహం కొంత తగ్గినట్లు ఆ పార్టీ వర్గాలే అనధికారికంగా పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతం కంటే భిన్నంగా.. ఈ మధ్య కాంగ్రెస్‌పైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో భాజపా పరిస్థితిపై పార్టీ ఇన్‌ఛార్జి సునీల్‌బన్సల్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలతో ఈటల ఇప్పటికే చర్చించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. ఈటల పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నా.. అందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌ లాంటి సంస్థల నుంచి అంత సానుకూలత ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను కీలకమైన పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా సంజయ్‌ను మార్చి.. కిషన్‌రెడ్డి లేదా మరొకరిని నియమిస్తారని, సంజయ్‌కు తగిన ప్రాధాన్యమిచ్చేందుకు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని