నార్త్‌ గుజరాత్‌లో ఈసారి పైచేయి ఎవరిదో? తుది విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం!

దేశమంతా ఆసక్తి రేపుతోన్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Election2022) తుది సమరానికి సర్వం సిద్ధమైంది. 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో సోమవారం తుది విడత పోలింగ్‌ జరగనుంది.

Published : 05 Dec 2022 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశమంతా ఆసక్తి రేపుతోన్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Election2022) తుది సమరానికి సర్వం సిద్ధమైంది. 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో సోమవారం తుది విడత పోలింగ్‌ జరగనుంది. భాజపా-కాంగ్రెస్‌-ఆప్‌ మధ్య కొనసాగుతోన్న ఈ త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌ను ఏలుతోన్న భాజపా ఈసారి అత్యధికంగా ఓట్లు, సీట్లు గెలుచుకొని చరిత్ర తిరగరాయాలని ప్రయత్నిస్తుండగా.. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌, సత్తా చాటాలని ఆప్‌ తీవ్రంగా శ్రమించాయి. తుది దశలో పోలింగ్‌ జరగనున్న నార్త్‌ గుజరాత్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కన్నా తక్కువ సీట్లు సాధించిన భాజపాకు ఈసారి ఎన్ని సీట్లు వస్తాయోనన్న ఆసక్తి నెలకొంది. 

మిగతా రెండు ప్రధాన పార్టీలతో పోలిస్తే భాజపా ప్రచారంలో దూసుకుపోయింది. తగ్గేదేలే అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని అమిత్‌ షా, యోగి ఆదిత్యనాథ్‌, పలువురు కేంద్రమంత్రులు, పార్టీ సీనియర్లను రంగంలోకి దించింది. 93 సీట్లకు గాను 2017 ఎన్నికల్లో భాజపా 51 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ 39 చోట్ల, స్వతంత్రులు మూడు చోట్ల విజయం సాధించారు. వీటిలో సెంట్రల్‌ గుజరాత్‌లో భాజపాకు అధిక సీట్లువచ్చినప్పటికీ.. నార్త్‌ గుజరాత్‌లో మాత్రం కాంగ్రెస్‌ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. సెంట్రల్‌ గుజరాత్‌లో భాజపా 37, కాంగ్రెస్‌ 22 సీట్లు గెలుచుకోగా.. నార్త్‌ గుజరాత్‌లో కాంగ్రెస్‌ 17 సీట్లు గెలుచుకోగా.. కమలనాథులు 14 సీట్లకు పరిమితమయ్యారు. రికార్డుస్థాయిలో విజయం సాధించాలన్న కసితో ఉన్నభాజపాకు ఈసారి ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి!

5.96లక్షల మంది 19ఏళ్ల లోపు ఓటర్లే..

గుజరాత్‌లో మొత్తం 182 సీట్లకు గాను డిసెంబర్‌ 1న తొలి విడతలో 89 సీట్లకు పోలింగ్ జరగ్గా.. 63.31శాతం పోలింగ్‌ నమోదైంది. డిసెంబర్‌ 5న రెండో దశలో మిగిలిన స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ దశలో భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌లతో కలిపి  61 పార్టీల నుంచి మొత్తంగా 833 మంది అభ్యర్థులు రేసులో ఉన్నారు. భాజపా, ఆప్‌ 93 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించగా.. కాంగ్రెస్‌ 90 చోట్ల పోటీ చేస్తూ తన మిత్రపక్షం ఎన్సీపీ అభ్యర్థులను రెండు చోట్ల నుంచి బరిలో దించుతోంది. ఇకపోతే భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) 12చోట్ల, బీఎస్పీ 44 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ అంతా తానై ఒంటిచేత్తో ప్రచారం నిర్వహించారు. వరుస ర్యాలీలు, భారీ రోడ్‌షోలతో ప్రచారం హోరెత్తించారు. రెండో దశలో మొత్తం 2.51కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1.29 కోట్ల మంది పురుష ఓటర్లు కాగా.. 1.22కోట్ల మంది పమహిళా ఓటర్లు. 5.96లక్షల మంది 18 నుంచి 19ఏళ్ల యువ ఓటర్లే ఉండటం విశేషం. ఈ ఎన్నికల కోసం 14,975 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1.13లక్షల మంది పోలింగ్‌ సిబ్బందిని మోహరించారు.

బరిలో కీలక నేతలు 

అహ్మదాబాద్‌ జిల్లాలోని ఘట్లోడియా నుంచి సీఎం భూపేంద్ర పటేల్‌, వీరామ్‌గామ్‌ నుంచి పాటీదార్‌ ఉద్యమ నేత హర్దిక్‌ పటేల్‌, గాంధీనగర్‌ సౌత్‌ నుంచి అల్పేశ్‌ ఠాకూర్‌ భాజపా టిక్కెట్‌పై బరిలో నిలుస్తున్నారు. అలాగే, ప్రముఖ దళిత ఉద్యమ నేత జిగ్నేశ్‌ మేవానీ కాంగ్రెస్‌ తరఫున వాద్గామ్‌ సీటు నుంచి రేసులో ఉండగా.. గుజరాత్‌ ప్రతిపక్ష నేత సుఖరామ్‌ రాట్వా జెట్పూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. భాజపా రెబల్‌ అభ్యర్థి మధు శ్రీవాస్తవ్‌  వడోదరలోని వాఘోడియా సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని