కేసులు ఎదుర్కోవడం నాకు కొత్త కాదు.. ఆ విషయం జోయల్‌ డేవిస్‌కు బాగా తెలుసు: రఘునందన్‌రావు

జూబ్లీహిల్స్‌లో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి బాధితురాలి ఫొటోలు తాను విడుదల చేయకముందే అన్ని టీవీల్లో దృశ్యాలు వచ్చాయని

Published : 07 Jun 2022 02:05 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి బాధితురాలి ఫొటోలు తాను విడుదల చేయకముందే అన్ని టీవీల్లో దృశ్యాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారు. అంతేకాకుండా తాను బాలిక పేరు ఎక్కడా చెప్పలేదని, ముఖం కూడా చూపెట్టలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసు నుంచి ఎంఐఎం నాయకులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసలు దోషులను తప్పించాలనే దుర్మార్గమైన కుట్ర జరుగుతోందని విమర్శించారు.

కేసులు ఎదుర్కోవడం తనకు కొత్త కాదని.. డీసీపీ జోయల్‌ డేవిస్‌కు ఆ విషయం బాగా తెలుసునన్నారు. తన తప్పుంటే కేసు పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మాజీ మంత్రులు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని, వారు మానసిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడంలేదని కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలంటే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు అరెస్టు కోసం ఆందోళన చేయాలన్నారు. తాను భాజపాలో చేరిన తర్వాత ఎక్కడా కేసులు వాదించలేదని రఘునందన్‌ చెప్పారు. తెరాస, మజ్లిస్‌, కాంగ్రెస్‌ కలిసి తన మీదకు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తాను హోంమంత్రి మనవడి గురించి ఎక్కడా మాట్లాడలేదని, ఎలాంటి వీడియోలు బయటపెట్టలేదని రఘునందన్‌రావు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని