BJP: హంగ్‌ రాదు.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ ఎన్‌డీయేదే పవర్‌: ఎగ్జిట్ పోల్స్‌పై హిమంత

మూడు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎన్‌డీయే(NDA)నే స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma)  అన్నారు. ఎక్కడా  హంగ్‌ రాదని చెప్పారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నిన్న వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై ఆయన స్పందించారు.

Published : 01 Mar 2023 01:44 IST

గువాహటి: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర(Tripura), నాగాలాండ్(nagaland)‌, మేఘాలయ(Meghalaya) అసెంబ్లీ ఎన్నికలపై నిన్న వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌(Exit polls) అంచనాలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma)  స్పందించారు. మేఘాలయలో హంగ్‌ అసెంబ్లీ వస్తుందని, త్రిపుర, నాగాలాండ్‌లో భాజపా కూటమిదే అధికారమంటూ జోస్యం చెప్పగా.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ ఎన్డీయేదే విజయమని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. గువాహటిలో మీడియాతో మాట్లాడుతూ.. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో పూర్తి మెజార్టీ సాధించి ఎన్‌డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. నార్త్‌ ఈస్ట్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌కు కన్వీనర్‌గా ఉన్న హిమంత.. ఎన్‌డీఏ భాగస్వాములు కాంగ్రెస్‌ లేదా తృణమూల్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోరన్నారు. 

ఈ మూడు రాష్ట్రాల్లో సీఎం పదవి చేపట్టే అభ్యర్థుల గురించి విలేకర్లు ప్రశ్నించగా.. త్రిపుర, నాగాలాండ్‌లలో యథాతథస్థితి కొనసాగుతుందన్నారు. త్రిపురలో భాజపా సీఎం ఉంటారని, నాగాలాండ్‌ సంకీర్ణ ప్రభుత్వంలో  ఉంటుందని  హిమంత చెప్పారు. త్రిపురలో భాజపా సీఎం ఉంటారని, నాగాలాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వంలో తాము ఉంటామని వ్యాఖ్యానించారు. మేఘాలయలో మాత్రం భాజపా సాధించిన సీట్లను బట్టి సీఎంగా ఎవరు ఉండాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. 

ఈశాన్య భారత్‌లో ఆసక్తి రేకెత్తించిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం దక్కబోదని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అక్కడ సీఎం కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశాలున్నాయని.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మాత్రం దానికి రాబోదని పేర్కొన్నాయి. నాగాలాండ్‌లో అధికార నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ), భాజపాల కూటమి ఘన విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ జోస్యం చెప్పాయి. త్రిపురలో కమలదళం వైపే మొగ్గు కనిపిస్తున్నా.. కొత్త పార్టీ టిప్రా మోథా కింగ్‌ మేకర్‌గా అవతరించే అవకాశాలు లేకపోలేదని తెలిపాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగ్గా.. నాగాలాండ్‌, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. మార్చి 2న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని