ఎంసీజీలో రహానెకు అరుదైన గౌరవం

టీమ్‌ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానెకు ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)లో అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జరిగిన బాక్సింగ్‌డే టెస్టులో అతడు శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే...

Updated : 31 Dec 2020 14:42 IST

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానెకు ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)లో అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జరిగిన బాక్సింగ్‌డే టెస్టులో అతడు శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌ మ్యాచ్‌ గెలవడమే కాకుండా అడిలైడ్‌ ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ క్రమంలోనే అతడు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికై ‘జానీ ముల్లగ్‌’ పతకం సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇది మాత్రమే కాకుండా ఎంసీజీ ప్రతిష్ఠాత్మకంగా గౌరవించే బోర్డులో రెండోసారి తన పేరును నమోదు చేసుకున్నాడు.

టీమ్‌ఇండియా ఈ విషయాన్ని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. 2014 బాక్సింగ్‌ డే టెస్టులో రహానె(147) తొలిసారి ఇదే మైదానంలో శతకంతో కదం తొక్కాడు. అప్పుడు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తాజా సిరీస్‌లో రెండోసారి శతకం బాది క్లిష్ట సమయంలో భారత్‌ను గెలిపించాడు. దీంతో ఎంసీజీ నిర్వాహకులు రహానె పేరును రెండోసారి గౌరవ సూచికంగా ఆ బోర్డుపై లిఖించారు. ఆ వీడియోను టీమ్‌ఇండియా అభిమానులతో పంచుకుంది.

ఇక ఈ మ్యాచ్‌లో రహానె బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ ఆకట్టుకున్నాడు. విరాట్‌ కోహ్లీ, మహ్మద్‌ షమి, రోహిత్‌ శర్మ లాంటి కీలక ఆటగాళ్లు లేకున్నా జట్టును ముందుండి నడిపించాడు. తన వ్యూహాలు, నైపుణ్యాలతో ఆసీస్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో అందరి చేతా శెభాష్‌ అనిపించుకున్నాడు.

ఇవీ చదవండి..
ధోనీ, కోహ్లీ సరసన నిలిచా: జడేజా
అసలిది ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్పేనా: సచిన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని