ఐపీఎల్‌ బౌలర్లారా జాగ్రత్త..! ధోనీ వస్తున్నాడు 

వచ్చే నెల నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో ధోనీ రెచ్చిపోతాడని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఎంతో మంది ఆటగాళ్లు...

Updated : 17 Aug 2020 14:44 IST

రోహిత్‌ కన్నా డబుల్‌ సెంచరీలు కొట్టొచ్చేమో కానీ..

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే నెల నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ధోనీ రెచ్చిపోతాడని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఎంతో మంది ఆటగాళ్లు ఆడతారని, ముఖ్యంగా బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ఎందుకంటే చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ధోనీ బాగా ఆడతాడని, దాన్ని అతడు ఆస్వాదిస్తాడని చెప్పాడు. ఇప్పుడు రిటైరైన నేపథ్యంలో మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. అలాగే తనలాంటి రిటైరైన బౌలర్లు సంతోషంగా ఉంటామని సరదాగా అన్నాడు. ఎందుకంటే వారిప్పుడు సీఎస్కే కెప్టెన్‌కు బంతులు వేసే అవకాశం లేకుండా తప్పించుకున్నామని జోక్‌ చేశాడు. ఈ ఐపీఎల్‌ కోసం ఎదురుచూస్తున్నానని, ఆ టోర్నీలో ఆడే బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు. ధోనీ రిటైర్మెంట్‌ సందర్భంగా స్టార్‌స్పోర్ట్స్‌ నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో ఇర్ఫాన్‌ ఇలా చెప్పుకొచ్చాడు.

 ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌.. ధోనీకి సంబంధించిన ఓ అద్భుత రికార్డును కొనియాడాడు. మహీ కెప్టెన్సీలోనే భారత్‌ మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు గెలిచిందని, ఈ రికార్డు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పాడు. ఈ విషయంలో సవాలు చేసేందుకైనా సిద్ధమని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ధోనీ రికార్డును.. రోహిత్‌ డబుల్ సెంచరీలతో పోల్చాడు గౌతమ్‌ గంభీర్‌‌. హిట్‌మ్యాన్‌లా ఎవరైనా వన్డేల్లో ఎక్కువ ద్విశతకాలు కొట్టొచ్చేమో కానీ, మరే భారత కెప్టెన్‌ కూడా అలా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించలేడని వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌.. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఎలాగూ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన నేపథ్యంలో ఇక ఐపీఎల్‌లో బ్యాట్‌ ఝుళిపించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని