ధోనీ కుమార్తెపై బెదిరింపులు: బాలుడి అరెస్టు

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, చెన్నై సారథి మహేంద్రసింగ్ ధోనీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడ్డ ఓ బాలుడిని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

Published : 12 Oct 2020 16:24 IST

గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

అహ్మదాబాద్‌: భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, చెన్నై సారథి మహేంద్రసింగ్ ధోనీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడ్డ ఓ బాలుడిని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ పోస్టు తానే చేసినట్లు సదరు బాలుడు(16) అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఐదు రోజుల క్రితం చెన్నై, కోల్‌కతాకి మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి చెన్నై కెప్టెన్‌ ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో ఆమె కుమార్తెపై తీవ్ర పదజాలంతో ఓ పోస్టు చేశాడు. దీంతో ఆ పోస్టు తీవ్ర కలకలం రేపింది. పలువురు క్రికెటర్లు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తూ సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.

దీంతో అప్రమత్తమైన రాంచీ పోలీసులు విచారణ చేపట్టి ఆ పోస్టు చేసింది గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలుడిగా గుర్తించారు. దీంతో ఆ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేయగా వారు వెంటనే స్పందించారు. సదరు 12వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో బాలుడు నేరం అంగీకరించినట్లు పోలీసు సూపరింటెండెంట్‌ సౌరబ్‌సింగ్‌ వెల్లడించారు. కాగా ఆ పోస్టును ఆ బాలుడు ఒక్కడే పోస్టు చేశాడా, లేక ఇంకెవరితోనైనా కలిసి పోస్టు చేశాడా అనే కోణంలో విచారిస్తున్నారు. తదుపరి విచారణ కోసం బాలుడిని రాంచీ పోలీసులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని